కారు ప్రమాదంలో మహిళా టెక్కీ మృతి, వ్యక్తికి గాయం
హైదరాబాద్: కారు ప్రమాదంలో సాఫ్టువేర్ ఇంజనీర్ దుర్మరణం చెందారు. దైవ దర్శనం కోసం కారులో వెళ్లిన ఇద్దరు సాఫ్టువేర్ ఉద్యోగులు ప్రమాదానికి గురయ్యారు. వారిలో ఒకరు అక్కడికి అక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నర్సాపూర్ - తూప్రాన్ మార్గంలోని హన్మంతాపూర్ దగ్గరలో చోటు చేసుకుంది.
మాదాపూర్లోని ఓ సాఫ్టువేర్ కంపెనీలో అపూర్వ అనే 26 ఏళ్ల యువతి ఆపరేషన్స్ మేనేజర్గా పని చేస్తున్నారు. అనిల్ ఫైనాన్స్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం వీరు శివంపేట మండలం చిన్న గొట్టిముక్కల సహకార ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చారు.
తిరిగి వెళ్తుండగా కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గోతిలోకి దూసుకు పోయింది. దీంతో ముందు సీటులో ఇరుక్కుపోయిన అపూర్వ అక్కడికి అక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ అనిల్ను నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం హైదరాబాదులోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.
గ్యాస్ లీకై భార్యాభర్తలు మృతి
ఇంట్లో గ్యాస్ లీకై తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్న భార్యాభర్తలు మృతి చెందారు. బాలానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. గౌతం నగర్కు చెందిన భార్యాభర్తలు భాస్కర రెడ్డి, పరమేశ్వరి 24వ తేదీన ఉదయం ఇంటికి వచ్చేసరికి ఇంట్లో నుండి గ్యాస్ వాసన వస్తుందని... భర్త తాళం తీసి సిలిండర్ రెగ్యులేటర్ తొలగిస్తుండగా.. భార్య లైట్ వేసింది. దీంతో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి మనంటలు ఎగిసిపడ్డాయి. వారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.