బైక్ ఢీకొని టెక్కీ మృతి: టెక్కీ సుప్రియ కేసు ట్విస్ట్, ప్రియుడితో గొడవపడి..
హైదరాబాద్: బైక్ని గుర్తు తెలియని వాహనం ఢీకొన్న సంఘటనలో సాఫ్టువేర్ ఇంజనీర్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. కేపీహెచ్బీ పోలీసు స్టేషన్ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన వెంకట అప్పారావు, విజయలక్ష్మి దంపతులు ఆల్విన్ కాలనీలో ఉంటున్నారు.
వీరికి ఇద్దరు పిల్లలు. వెంకట అప్పారావు మాదాపూర్లోని ఓ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆదివారం ఉదయం విధులు ముగించుకొని తన ద్విచక్ర వాహనం పైన ఇంటికి తిరిగి వస్తుండగా.. మలేషియా టౌన్ షిప్ సమీపంలో గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన అతను అక్కడికి అక్కడే మృతి చెందారు.
టెక్కీ సుప్రియ మృతి కేసులో విచారణ
తాను పని చేస్తున్న కంపెనీ భవనం పై నుండి కిందపడి ఓ సాఫ్టువేర్ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో రెండు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటన హైదరాబాదులోని మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా యాప్రాల్ సాయికృపా కాలనీకి చెందిన సుదర్శన్ కుమార్ కూతురు సుప్రియ సాఫ్టువేర్ ఇంజనీర్. ఆమె రెండు రోజుల క్రితం మృతి చెందారు.
దీని పైన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆమెకు సన్నిహితుడు అయిన కిరణ్ను పోలీసులు విచారిస్తున్నారు. సుప్రియ మృతి చెందిన రోజు రాత్రి ఏం జరిగిందనే విషయం తెలుసుకునేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఆ రోజు రాత్రి ఉన్న తోటి ఉద్యోగులను ప్రశ్నిస్తున్నారు.
ప్రేమికుల రోజు బహుమతి విషయంలో కిరణ్, సుప్రియల మధ్య వాగ్వాదం జరిగిందని పోలీసులు చెప్పారు. కిరణ్ అక్కడి నుండి వెళ్లిపోగా.. సుప్రియ ఎక్కడకు వెళ్లింది, తర్వాత తానే మనస్తాపంతో దూకిందా లేక ఎవరైనా తోశారా అనే విషయం తేలాల్సి ఉంది. ప్రాథమిక విచారణను బట్టి సుప్రియ భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటుందని భావిస్తున్నారు.
కాగా, సుప్రియ హైటెక్ సిటీ సైబర్ పెరల్ భవనంలోని ఓ ఐటీ కంపెనీలో ఏడాదిన్నరగా పని చేస్తున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం సాయంత్రం కంపెనీకి వచ్చిన సుప్రియ రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో టీ విరామానికి బయటకు వెళ్లారు. అరగంట తర్వాత మళ్లీ కంపెనీలోకి వచ్చారు. ఆ తర్వాత రాత్రి ఒకటిన్నర గంటల సమయంలో కంపెనీ భవనం బయటకు వెళ్లే మార్గంలో కింద గాయాలతో సుప్రియ పడి ఉన్నారు.
ఇది గమనించిన భద్రతా సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ రాత్రి రెండున్నర గంటలకు మృతి చెందారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఎవరైనా తోసేసి ఉంటారని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. సుప్రియకు అదే కంపెనీకి చెందిన ఓ వ్యక్తితే ప్రేమ వ్యవహారం ఉందని పోలీసుల విచారణలో తేలిందని సమాచారం.