చెన్నై లాడ్జిలో ఆంధ్రా టెక్కీ ఆత్మహత్య, భార్యకు ఫోన్ చేసి..
ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన సుధీర్ (30), శ్రీవల్లి (28) దంపతులు. వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. కాగా, ఉపాధి కోసం కొద్ది నెలల క్రితం చెన్నైకి చేరుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక మేడవాక్కంలో బస చేస్తూ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నించిన సుధీర్ లండన్కు వెళ్లారు. అక్కడ కొద్ది రోజులు ఉద్యోగం చేశారని తెలుస్తోంది.
శ్రీవల్లి మాత్రం ఇక్కడే ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సుధీర్కు లండన్లో ఉద్యోగం పోయినట్లుగా తెలుస్తోంది. లండన్ నుంచి చెన్నైకి చేరుకున్న సుధీర్ శనివారం రాత్రి పల్లావరంలోని ఓ లాడ్జిలో బస చేసి భార్యతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ఆయన లాడ్జి గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆదివారం ఉదయం సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. పల్లావరం పోలీసులు సుధీర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, సుధీర్ లండన్లో తన ఉద్యోగాన్ని కొన్ని నెలల క్రితం కోల్పోయారు. ఆ తర్వాత ఉద్యోగం వెతుక్కోవడం ప్రారంభించారు. అదే సమయంలో ఈ ఘోరం జరిగింది.
అతను యూకేలోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. భార్య శ్రీవల్లి చెన్నై సమీపంలోని సిరుసేరిలోని ఓ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. సుధీర్ శనివారం రాత్రి చెన్నై వచ్చారు. అతను చెన్నైకి వస్తున్నట్లుగా భార్యకు తెలియదు. చెన్నై వచ్చి ఫోన్లో మాట్లాడాకే తెలిసింది.
అనంతరం అతను హోటల్లో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు సూసైట్ నోడ్ స్వాధీనం చేసుకున్నారు. దానిని అతను తెలుగులో రాశారు. తాను ఉద్యోగం పొందడంలో విఫలమయ్యానని, దీంతో తాను తన భార్యకు మంచి భర్తగా, తన తల్లిదండ్రులకు మంచి కొడుకుగా ఉండలేకపోతున్నానని పేర్కొన్నారు.