ఎన్నికల్లో టెక్నాలజీ వినియోగానికి బద్ధ వ్యతిరేకిని: ప్రజాస్వామ్యానికి అది హానికరం
Recommended Video
అమరావతి: దేశంలో ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించే ఎన్నికల ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించకూడదని, దీనివల్ల అనేక అనర్థాలు తలెత్తుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యానికి ఈ విధానం అత్యంత హానికరమని చెప్పారు. ఎన్నికల్లో సాంకేతిక పరిజ్క్షానాన్ని వినియోగించకోవడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని తేల్చి చెప్పారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను సులువుగా హ్యాక్ చేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సెల్ ఫోన్లను ట్యాప్ చేసినంత తేలిగ్గా ఈవీఎంలను ట్యాంపర్ చేయడానికి అవకాశం ఉందని కుండబద్దలు కొట్టారు. ఈవీఎం అనేది క్లిష్టమైన టెక్నాలజీని కలిగి ఉందంటూ మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చుకోవడం గమనార్హం.
ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు మాట్లాడారు. ఈవీఎంలు, టెక్నాలజీ, సెల్ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపై మాట్లాడారు. కేంద్ర ఎన్నికల కమిషన్ వైఖరిని తప్పు పట్టారు. ఎన్నికల అధికారులు కేంద్ర ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారుల పనితీరుపై విమర్శలు రాలేదని అన్నారు.
మనకంటే మేధావులు ఉన్నారు..
ఎన్నికల ప్రక్రియ అనేది ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు అని, అలాంటి కీలక వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం అనర్థాలకు దారి తీస్తుందని చంద్రబాబు అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని తాను వ్యతిరేకం కాదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. టెక్నాలజీని తాను నమ్ముతానని, ఎన్నికల్లో సాంకేతికతను వినియోగించడాన్ని తాను విశ్వసించబోనని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా, ప్రజల మనోభీష్టాలకు అనుగుణంగా ఎన్నికలను కొనసాగించాల్సిన వ్యవస్థలో సాంకేతికతను వినియోగించడం సరికాదని, దీన్ని తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యానికి సాంకేతికత అత్యంత హానికారకమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో తన ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కార్యకలాపాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చానని అన్నారు. సైబర్ సెక్యూరిటీ వంటి వ్యవస్థ అందుబాటులో ఉన్నప్పటికీ.. మనకంటే మేధావులు ఉన్నారని, వారివల్ల ఆయా వ్యవస్థలకు ముప్పు వాటల్లుతుందని చంద్రబాబు అన్నారు.
ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ఈసీ
కేంద్ర ఎన్నికల కమిషన్ పనితీరు ఎప్పుడూ లేనంతగా విమర్శల పాలైందని చంద్రబాబు అన్నారు. తాను 1978 నుంచీ ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నానని, ఎన్నో ఎన్నికలను తాను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. అయినప్పటికీ- ఈ సారి వచ్చినన్ని విమర్శలు ఎప్పుడూ రాలేదని అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్, రిటర్నింగ్ అధికారులను ప్రజలు పోలింగ్ బూత్లల్లో నిలదీస్తున్నారని చెప్పారు. వారి పనితీరును వ్యతిరేకిస్తూ శాపనార్థలు పెడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ప్రజల విశ్వాసాన్ని ఎప్పుడో కోల్పోయిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో ఎన్నికల అధికారులు పనిచేస్తున్నారని విమర్శించారు. తాను వ్యవస్థను విమర్శించట్లేదని, అందులోని వ్యక్తులను తప్పు పడుతున్నానని అన్నారు. తమకు నచ్చిన అభ్యర్థికే ఓటు వేశామనే ఆత్మవిశ్వాసాన్ని ఎన్నికల కమిషన్ ప్రజల్లో కల్పించలేకపోయిందని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ, ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించినప్పటికీ.. ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించేలేకపోతోందని చంద్రబాబు ఆరోపించారు.
ఎన్నికల్లో పారదర్శకత కోసం అయిదేళ్లుగా పోరాడుతున్నా:
ఎన్నికల వ్యవస్థలో, ప్రక్రియలో పారదర్శకతను తీసుకుని రావడానికి తాను అయిదేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నానని, ఏనాడూ విశ్రమించలేదని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను తీసుకుని రావడానికి తాను 24 గంటలూ కష్టపడుతున్నానని చంద్రబాబు చెప్పారు. ప్రజల్లో గానీ, నాయకుల్లో గానీ, రాజకీయ పార్టీల్లో గానీ, అభ్యర్థుల్లో గానీ ఓటింగ్ ప్రక్రియపై ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్దేనని, అధికారులు దీన్ని విస్మరించారని చెప్పారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని కల్పించడంలో విఫలం అయ్యారని చెప్పారు.
నా పోరాటం వల్లే అయిదు ఈవీఎంలకు పెంపు
గతంలో ఒక్కో నియోజకవర్గంలో గంపగుత్తగా ఒక్క ఈవీఎంకు చెందిన వీవీప్యాట్ స్లిప్పులను మాత్రమే లెక్కించే వారని, తాను పోరాటం చేయడం వల్ల ఈ సంఖ్యను సుప్రీంకోర్టు అయిదుకు పెంచిందని చంద్రబాబు చెప్పారు. ఈవీఎం అనేది క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉందని అన్నారు. రిటర్నింగ్ అధికారి, ఎన్నికల పరిశీలకుడు, పోలింగ్ ఏజెంట్ సమక్షంలో ఈవీఎంలను లెక్కిస్తారని, వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడం సులభతరమని చెప్పారు.
సెల్ఫోన్ ట్యాప్ చేసినంత సులువుగా ట్యాంపర్
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ట్యాంపర్ చేయడం సులభమేనని అన్నారు. సెల్ఫోన్లను ట్యాప్ చేసినంత సులువుగా వాటిని ట్యాంపర్ చేయొచ్చని చెప్పారు. ఎవరి సెల్ఫోన్ అయినా ఇట్టే ట్యాప్ చేస్తున్నారని చంద్రబాబు చెప్పారు. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను.. వంటి శాఖలన్నీ భ్రష్టు పట్టాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రతి వ్యవస్థనూ తమకు అనుకూలంగా మార్చుకున్నారని చెప్పారు. ఇదే క్రమంలో- ఎన్నికల సంఘాన్ని కూడా ప్రభావితం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల కమిషన్లోని అధికారులను నియమించేది కేంద్ర ప్రభుత్వమేనని, అందువల్లే వాళ్లు చెప్పినట్టే వింటారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.