ఉగ్రనరసింహుడినవుతా: కేసీఆర్, చానళ్ల నిలిపివేత పైన..
హైదరాబాద్: హైదరాబాద్లో అక్రమ భవనాలు కూల్చితే కొందరు భయపడుతున్నారని, కొన్ని పార్టీలు విచిత్రంగా మాట్లాడుతున్నాయని, కూలగొట్టిన ఇళ్లు ఎవరివో కూడా తనకు తెలియదని, తనకు ఎవరిపైనా కక్ష లేదని, కక్ష ఉందంటే అక్రమార్కులు, భూకబ్జాదారులపైనే ఉందని, వారిని వదిలేది లేదని, వారి భరతం పడతామని, జైల్లో పెడతామని, ఇది ఆరంభం మాత్రమేనని, మున్ముందు ఉగ్ర నరసింహావతారమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు.
బుధవారం భారీ అజెండాతో సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. కేబినెట్ నిర్ణయాలను స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అమలు చేయాల్సిన హామీలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై అడగగా.. ఒకే విషయం వివరంగా చెబుతానని, ఇందులో అన్నింటికి సమాధానాలు లభిస్తాయన్నారు. గత ప్రభుత్వం హయాంలో అనేక అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ పరిస్థితిని వివరించారు.

రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన రాజధాని హైదరాబాద్లోనే అనుమతుల్లేని 60 వేల నిర్మాణాలున్నాయి. హైటెక్, తోకటెక్ చేశామని చెబుతున్నారని, వర్షం వస్తే ఎక్కడపడితే అక్కడ నీళ్లు అక్కడే ఆగుతున్నాయన్నారు. రాజ్భవన్ ముందు, సీఎం ఆఫీసు ముందు, సచివాలయం ముందు నీళ్లు ఆగుతున్నాయన్నారు. కార్లు పడవలుగా మారుతున్నాయన్నారు.
ఎందుకు ఇలా జరిగిందని సమీక్షిస్తే... నాలాలను కబ్జా చేసేశారని అధికారులు తెలిపారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరు నూరైనా అంగుళం భూమి కబ్జా కానివ్వమని, ఇక కబ్జాదారుల ఆటలు సాగనివ్వమన్నారు. రాష్ట్రం ఏర్పడే వరకే రభస ఉంటుందని, తర్వాత అంతా సర్దుకుంటుందని చెప్పానని అన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడమన్నారు. హైదరాబాద్లో శాంతియుత, క్రమబద్ధీకరణతో కూడిన సమాజం కావాలన్నారు. నగరంలో ప్రతి చోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.
తెలంగాణ కోసం ప్రాజెక్టులను ఎలా కట్టాలన్న దానిపై నిపుణులు, జర్నలిస్టులతో అవసరమయితే మూడు నాలుగు హెలికాప్టర్లో ప్రయాణం చేసి సర్వే చేస్తామన్నారు. నది మొదలు నుంచి చివరి దాకా వీడియో చిత్రీకరణ చేస్తూ అనుకూలతను బట్టే బడతామన్నారు. ఆ సర్వే కోసం త్వరలో తేదీలు ఖరారు చేస్తామన్నారు. మరోవైపు తెలంగాణలో ఛానళ్ల నిలిపివేతతో తమకు సంబంధం లేదన్నారు.












Click it and Unblock the Notifications