సుప్రీంకోర్టుకు వెళ్లాం, అవసరమైతే నేనే వాదిస్తా: కేసీఆర్
హైదరాబాద్: నీటి కేటాయింపులపై తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, అవసరమైతే ట్రైబ్యునల్ ముందు తానే స్వయంగా వాదిస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. ప్రాజెక్టులు, నీటి పైన చర్చ సమయంలో కేసీఆర్ శాసన సభలో మాట్లాడారు.
తెలంగాణ ప్రాజెక్టులను సమైక్య పాలకులు తొక్కిపెట్టారన్నారు. ప్రాజెక్టుల పైన తమ సర్కారు చిత్తశుద్ధితో ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. ఎస్సెల్ బీసీ టన్నెల్ విషయంలో సమైక్య పాలకులు అనేక కొర్రీలు పెట్టారన్నారు. నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందన్నారు. దీనిపై సుప్రీంను ఆశ్రయించామన్నారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అడుగడుగునా అన్యాయం జరిగిందన్నారు. అలాగే పీటముడులు ఉన్నాయని చెప్పారు. ఎస్సెల్ బీసీ టన్నెల్ ఇంజనీర్లను తాను పిలిచి మాట్లాడానని తెలిపారు. పనులు ముందుకు సాగాలని రెండున్నర గంటలు వారితో మాట్లాడానన్నారు. డిండి, పెండ్లిపాక ప్రాజెక్టులు పూర్తయితేనే సమస్యలు తగ్గుతాయన్నారు. ఎస్సెల్ బీసీని ఎలా పూర్తి చేయాలో చెప్పాలన్నారు. అందుకోసం త్వరలో సమావేశం ఏర్పాటు చేసి అందర్నీ పిలుస్తామన్నారు.
ఇచ్చంపల్లి ప్రాజెక్టును కట్టి తీరాల్సిందే అన్నారు. కృష్ణా నీటిలో తెలంగాణకు న్యాయం జరగాలన్నారు. కృష్ణా, గోదావరి నదుల నీళ్లలో మన వాటా మనం సాధించుకోవాలన్నారు. లేకుంటే భవిష్యత్తు తరాలకు నష్టం జరుగుతుందన్నారు. ఏకోముఖంగా కొట్లాడి రాష్ట్ర ప్రాజెక్టులు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు.
నేతలు పరస్పరం నిందించుకోకుండా సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జానారెడ్డి సూచించడం అభినందనీయమన్నరాు. గత ప్రభుత్వాలు శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ పనులు పూర్తి చేయలేదన్నారు. ఇప్పటికైనా ఆగకుండా టన్నెల్ పనులు చేపడితే కనీసం రెండేళ్లు పడుతుందని తెలిపారు. ఇంకా 25 కిలోమీటర్లు తవ్వాలన్నారు.
టన్నెల్ నిర్మాణానికి సహకరిస్తామన్నందుకు నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రాజెక్టుల కోసం భేషజాలు అన్నీ పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలన్నారు. సమస్యల పైన చర్చించేందుకు మరో ఇరవై రోజులైన చర్చకు సిద్ధమన్నారు. ప్రాజెక్టుల పైన చిత్తశుద్ధితో ఉన్నామన్నారు.