టీ బిల్లు అయోమయం, కెసిఆర్ ఎవరు: చంద్రబాబు
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ బిల్లు అయోమయం సృష్టిస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. హైదరాబాద్, జలాలు, విద్యుత్తు, తదితర అంశాల్లో స్పష్టత లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఏ విషయంలోనూ స్పష్టత లేదని ఆయన అన్నారు. సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించడం లేదని ఆయన అన్నారు. మెజారిటీ జనాభా మరో పక్కకు వెళ్లే పరిస్థితి వచ్చిందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా చేస్తామని చెప్పారు గానీ హైదరాబాద్ ఆదాయం పంపకం గురించి చెప్పలేదని, హైదరాబాద్లోనే అన్ని సంస్థలు ఉన్నాయని ఆయన అన్నారు. విభజనలో సమన్యాయం చేయడం లేదని ఆయన అన్నారు. అప్పులను జనాభా ప్రాతిపదికపై పంచుతామంటున్న కేంద్రం ఆదాయం గురించి మాత్రం చెప్పడం లేదని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజన హేతుబద్దంగా, శాస్త్రీయంగా లేదని ఆయన విమర్సించారు. రాజకీయం చేస్తున్నారని, ఓట్ల కోసమూ సీట్ల కోసమూ రాష్ట్ర విభజనకు పూనుకున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో విద్యుత్ కొరత ఉందని, ఎత్తిపోతల పథకాల వల్ల ఆ కొరత మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ విషయం గురించి బిల్లులో స్పష్టత ఇవ్వలేదని ఆయన అన్నారు. ఏ ప్రాంతంలో ఉన్న విద్యుత్తు ప్రాజెక్టు ఆ ప్రాంతానికే చెందాలని ఆయన అన్నారు. విద్యుత్కేంద్రాలను ఎలా సర్దుబాటు చేస్తారో చెప్పలేదని ఆయన అన్నారు.
అందరితో మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సి ఉందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇష్టానుసారం చేస్తున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొరత లేకుండా చూశామని ఆయన చెప్పుకున్నారు. తెలంగాణకు విద్యుత్ అవసరాలు, సీమాంధ్రకు నీటి అవసరాలు ఎక్కువని, ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చెప్పలేదని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావుపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. తనపై మాట్లాడడానికి కెసిఆర్ ఎవరని ఆయన అడిగారు. ఆరు నెలల పాటు ఫామ్హౌస్లో నిద్రపోయి వచ్చే కెసిఆర్ నాయకుడా అని ఆయన అడిగారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలంగాణ అభివృద్ధికి కృషి చేసిన, చేస్తున్న తాను ద్రోహినా అని ఆయన అడిగారు. వ్యక్తిత్వం లేని కెసిఆర్ తన గురించి మాట్లాడడమా అని చంద్రబాబు అన్నారు. సెంటిమెంట్ పేరుతో జగన్, కెసిఆర్ రెచ్చగొడుతుంటే కాంగ్రెసు పార్టీ ఊతమిస్తోందని, శాశ్వతంగా కొట్టుకుంటూ రెండు ప్రాంతాలవాళ్లు అన్నదమ్ముల్లా ఎప్పుడూ కలుసుకోలేని స్థితిని మూడు పార్టీలు కల్పిస్తున్నాయని ఆయన అన్నారు. కెసిఆర్ నోటికి అడ్డులేకపోతే ఏది చేయాలో అది చేస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో తాను చేసిన దానికి ఫలితం ఉందని, కెసిఆర్ చేయదలుచుకుంది ఊహ అని ఆయన అన్నారు. తెలంగాణకు ఎవరేం చేశారో, ఎవరేమిటో తేల్చుకోవడానికి తాను బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications