14న మంత్రివర్గం: 18న స్పీకర్కు తెలంగాణ బిల్లు?

రాష్ట్రపతి నిర్దేశం కనుక, బిల్లు తనకు అందిన వెంటనే స్పీకర్ అసెంబ్లీని సమావేశపరచాల్సి ఉంటుంది. బిల్లుపై చర్చకు సాధారణంగా రాష్ట్రపతి పది రోజుల గడువు ఇస్తారు. అది చాలదని, పొడిగించాలని స్పీకర్ కోరితే, మరో ఐదారు రోజులు సమయం ఇవ్వవచ్చు. అంటే మొత్తమ్మీద నవంబరు మూడో వారం మొదట్లో రాష్ట్రానికి చేరే ముసాయిదా బిల్లుపై, నెలాఖరులోగా అసెంబ్లీ తన అభిప్రాయాన్ని తెలియజేసేలా కేంద్రం షెడ్యూలు రూపొందిస్తోంది.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు 5న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆలోగా బిల్లుకు సంబంధించిన విధివిధానాలన్నింటినీ కేంద్రం పూర్తి చేస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ ఏడో తేదీన తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టే అవకాశం ఉందని కేంద్ర మంత్రి బలరాం నాయక్ బుధవారం వ్యాఖ్యానించారు. విభజన ప్రక్రియపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) మూడో విడత గురువారం సమావేశం కానున్న విషయం తెలిసిందే.
సాయంత్రం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలోనూ పరిస్థితిపై చర్చిస్తారు. ఆ తర్వాత రాత్రి పొద్దుపోయే వరకూ జీవోఎం సమావేశమై ఈ నివేదికలు, ప్రతిపాదనలన్నింటిపై చర్చించే అవకాశముంది. ఈ సమావేశంతో విభజనకు సంబంధించి ముసాయిదా బిల్లు నివేదిక లేదా బిల్లు రూపకల్పన జరుగుతుంది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కిరణ్కు నచ్చచెప్పి, విభజన ప్రక్రియకు సహకరించేలా ఒప్పించేందుకు అధిష్ఠానం ఇందులో ప్రయత్నించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
12వ తేదీన రాష్ట్రానికి చెందిన ఐదు పార్టీలతో సమావేశం పూర్తయిన వెంటనే, అదే రోజుగానీ, మరుసటి రోజుగానీ జీవోఎం తదుపరి భేటీ జరిపి, బిల్లు ముసాయిదాను ఖరారు చేయనున్నట్టు మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. తర్వాత దీన్ని హోంశాఖ ద్వారా కేంద్ర కేబినెట్కు పంపిస్తారు. ఈనెల 14న గురువారం కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఇందులోనే విభజన బిల్లును కేబినెట్ ఆమోదిస్తుంది. తర్వాత నిర్ణీత ప్రక్రియ ప్రకారం ఒకటి రెండు రోజుల్లో దాన్ని రాష్ట్రపతి ప్రణబ్కు పంపిస్తారు.
బిల్లు ముసాయిదాను పరిశీలించిన తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ నవంబరు మూడో వారం మొదట్లో రాష్ట్ర అసెంబ్లీ పరిశీలనకు పంపించే అవకాశం ఉంది. 18నే బిల్లు స్పీకర్ కార్యాలయానికి రావచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి నిర్దేశించే పది రోజుల గడువు, లేదా పొడిగించే మరో ఐదారు రోజులు గడువు కలిపితే నవంబరు నెలాఖరుకల్లా అసెంబ్లీ అభిప్రాయం తెలిపే ప్రక్రియను ముగించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలిసిందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.
అప్పుడు అసెంబ్లీలో వ్యక్తమయ్యే, లేదా రాష్ట్రపతి సూచించే మార్పు చేర్పులకు అనుగుణంగా బిల్లులో సవరణలు చేసి, డిసెంబరు 5న ప్రారంభమయ్యే పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు వీలవుతుందని ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. విభజనకు సంబంధించి బిల్లులో ఉండాల్సిన విషయమంతా ఇప్పటికే ఖరారైందని, హైదరాబాద్ ప్రతిపత్తి ఒక్కటే అందులో చేర్చాల్సి ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications