టీ బిల్లు కాంగ్రెస్ను రక్షిస్తుందా: తుడిచిపెట్టుకునేదా?
హైదరాబాద్: తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడంతో చర్చ ఎన్నికల మీదికి మళ్లుతోంది. తెలంగాణ బిల్లు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసు పార్టీని కాపాడుతుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. రాష్ట్రాన్ని విభజించకపోతే కాంగ్రెసు పార్టీ పూర్తిగానే తుడిచిపెట్టుకుపోయేదని, విభజన వల్ల తెలంగాణ మెజారిటీ లోకసభ స్థానాలను గెలుచుకుంటుందని అంటున్నారు.
తెలంగాణలో 17 లోకసభ స్థానాలున్నాయి. కాంగ్రెసు, కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కలిసి మెజారిటీ సీట్లను గెలుచుకుంటాయని అంచనా వేస్తున్నారు. సీమాంధ్రలో 25 సీట్లున్నాయి. అయితే, ఈ 25 సీట్లలో కాంగ్రెసు ఒక్కటి కూడా గెలిచే అవకాశం లేదని అంటున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెసుకు రాష్ట్రం నుంచి 33 సీట్లు లభించాయి.
సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ కార్యక్రమాలు తుడిచిపెట్టుకుపోతాయని భావించడానికి వీలు లేదు. కానీ, బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, పనబాక లక్ష్మి, కావూరి సాంబశివ రావు వంటి నాయకులు కాంగ్రెసును నిలబెట్టే ప్రయత్నాలు చేయవచ్చునని అంటున్నారు. సీమాంధ్ర కుల సమీకరణలు జోరందుకుంటాయని భావిస్తున్నారు.
సీమాంధ్రలో ప్రస్తుతానికి వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే సమీకరణాలు మారవచ్చు. తెరాస విలీనానికి అంగీకరిస్తే కాంగ్రెసు పార్టీకి తెలంగాణలో నల్లేరు మీది నడకే అవుతుందని అంటున్నారు. కాంగ్రెసు అధిష్టానం విలీనానికే పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. విలీనమైనా కాకున్నా ఒక్కటిగానే పోటీ చేసే అవకాశాలున్నాయి.
తెలంగాణకు మద్దతుగా నిలిచిన బిజెపి తెలంగాణలో కాస్తా బలం పుంజుకున్నట్లు కనిపించినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పొత్తు వ్యవహారాలు నడిపి తెలంగాణను ఆపడానికి ప్రయత్నించినట్లు వార్తలు రావడం, బిజెపి తెలంగాణ బిల్లు ఆమోదానికి మొరాయించడం ఆ పార్టీకి నష్టమే కలిగించింది.