హోంశాఖకు టి: సుప్రీంలో 7 పిటిషన్స్, లాయర్లతో కిరణ్..
న్యూఢిల్లీ: తెలంగాణ ముసాయిదా బిల్లు కేంద్ర హోంశాఖ వద్దకు చేరుకుంది. బిల్లును క్లాజుల వారీగా సవరణలు సూచించే యోచనలో కేంద్ర హోంశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం మంత్రుల బృందం (జివోఎం) ఎదుట సవరణల ప్రతిపాదనలు కేంద్రం హోంశాఖ ఉంచనుంది.
జివోఎం ఆమోదం తర్వాత కేంద్ర హోంశాఖ బిల్లులో సవరణలు చేర్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 6 లేదా 7వ తేదీని కేబినెట్ ముందుకు తెలంగాణ బిల్లు రానున్నట్లు సమాచారం. సోమవారం ఉదయం ఎయిర్ ఇండియా విమానంలో సచివాలయ బృందం అధికారులు రెండు బృందాలుగా తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసన సభలో జరిగిన చర్చపై నివేదికను ఢిల్లీకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.
అరవై బండిళ్లతో కూడిన బిల్లును అధికారులు ఢిల్లీకి తీసుకు వచ్చారు. బిల్లుతో పాటు 13 మంది అధికారులు వచ్చారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు అన్ని ప్రతులను సమర్పిస్తున్నట్లు జిఏడి అధికారులు తెలిపారు.
విభజనను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో 7 పిటిషన్లు
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఏడు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటిని కోర్టు శుక్రవారం విచారించనుంది. ఇంతకుముందు నాలుగు పిటిషన్లు దాఖలు కాగా ఈ రోజు ఏడు పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీంను ఆశ్రయించే అంశంపై సీనియర్ న్యాయవాదులతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.