నవంబర్ 5 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అధ్యక్షతన తెలంగాణభవన్లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభానికి ముందే సీఎం జిల్లాల వారీగా సమీక్షలు జరిపారు.
ఈ సమావేశంలో వచ్చే నెల 5న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలిసింది. అదే రోజు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నవంబర్ 6న అసెంబ్లీకి సెలవు. నవంబర్ 23 వరకు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ సమావేశ సందర్భంగా జిల్లాల వారీగా అవసరాలను, సమస్యలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఈ భేటీలో పాల్గొనేందుకు ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణభవన్కు చేరుకున్నారు.
మంత్రి పోచారంను కలిసిన రైతు సంఘాల నేతలు
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డిని రైతు సంఘాల నేతలు శనివారం సచివాలయంలో కలిశారు. ఈ సందర్బంగా పలు రైతు సమస్యలను వారు మంత్రికి విన్నవించారు. రూ. 37 వేల కోట్లతో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల కోసం రూ. 15 వేల కోట్లు కేటాయించాలని మంత్రికి వినతి పత్రం సమర్పించారు.