APలో కేసీఆర్ చెప్పినట్లు జరుగుతుందా? వైసీపీనా? టీడీపీనా?
తెలంగాణ ముఖ్యమంత్రి కుల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) రెండురోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేసిన తర్వాత ఢిల్లీ, రాజస్తాన్, ఏపీ ప్రభుత్వాలను కూడా టార్గెట్ చేసిందని ఆరోపించారు. తమదగ్గరున్న వీడియోలో అందుకు సంబంధించి చర్చ కూడా జరిగిందని చెప్పారు. కేసీఆర్ చెప్పినట్లుగా ఏపీ ప్రభుత్వం కూలిపోయేతంగా బలహీనంగా ఉందా? లేదంటే ప్రతిపక్ష తెలుగుదేశం బలహీనంగా ఉందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

జగన్ చెప్పిందే శాసనం
ప్రభుత్వంలోకానీ, పార్టీలోకానీ ముఖ్యమంత్రి జగన్ చెప్పిందే శాసనంగా అమలవుతోంది. రెండింటిపై ఆయన గ్రిప్ అలా ఉంది. పార్టీలో ఉన్న నాయకులకు కూడా జగన్ పై పూర్తిస్థాయిలో అభిమానం ఉంది. ఒకవేళ ప్రభుత్వాన్ని చీల్చే ప్రయత్నం చేసినా అది తిరిగి తమకే రివర్స్ అయ్యే ప్రమాదముంందని బీజేపీ నేతలకు తెలుసు. కాబట్టి వారు అంత సాహసమైతే చేయరనేది రాజకీయ విశ్లేషకుల భావన. జగన్ భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ తో కలిసే ప్రయత్నం మాత్రం చేయరు. అన్ని విధాలుగా సహాయపడుతున్న వ్యక్తి కాబట్టి తమకు నష్టం జరగదనేది ఢిల్లీ పెద్దల భావనగా ఉంది.

టీడీపీలో ఏక్ నాథ్ షిండేలు?
తెలుగుదేశం పార్టీకి సంబంధించి విజయవాడ ఎంపీ కేశినేని నాని గతంలో పలు ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీని చీల్చేస్తారని, పార్టీలో సీఎం రమేష్ లాంటి ఏక్ నాథ్ షిండేలున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇటీవలి కాలంలో ఏపీ బీజేపీ నేతలు తరుచుగా తెలుగుదేశం పార్టీ త్వరలోనే అంతర్థానమవుతుందని, ఆ పార్టీ పనైపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీలో అధికారంలో లేని టీడీపీని బీజేపీ లక్ష్యంగా ఎంచుకునే అవకాశం ఉందని సీనియర్ రాజకీయవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు.

అన్ని రాష్ట్రాల్లో అమలు చేసే వ్యూహమే!
ఎందుకంటే బీజేపీ ఏ రాష్ట్రంలోనైనా మొదటిసారి ప్రథమ స్థానానికి చేరుకునేలా వ్యవహరించదు. ముందుగా ప్రతిపక్ష పార్టీలు అధికారం లేకుండా బలహీనపడి వుంటాయి కాబట్టి నేతలను పార్టీలోకి ఆకర్షించి ఆ తర్వాత ప్రతిపక్షాన్ని చేల్చే ప్రయత్నాలు చేస్తారు. తర్వాత కాలంలో రెండోస్థానంలోకి చేరుకుంటుంది. బలమైన ప్రతిపక్షంగా ఉండి అధికార పార్టీని ఢీకొట్టి ఎన్నికల్లో విజయం సాధిస్తుంది. మొదటి నుంచి అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఇదే వ్యూహాన్ని అమలుపరుస్తోంది. ఇప్పుడు ఏపీలో కూడా అలాగే చేయబోతుందని భావిస్తున్నారు.

దీర్ఘకాలిక వ్యూహంతోనే జూనియర్ తో భేటీ?
అలాగే జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా కలవడంవెనక దీర్ఘకాలిక వ్యూహం దాగివుంది. ప్రస్తుత తెలుగుదేశం పార్టీలో చంద్రబాబును వ్యతిరేకిస్తూ జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతిచ్చే వర్గం ఉంది. వీరంతా కేవలం పార్టీ కోసమే చంద్రబాబుకు మద్దతిస్తున్నారు. ఈ తరుణంలో ఒక వర్గాన్ని చీల్చి తమకు అనుకూలంగా మార్చుకుంటే టీడీపీని ఫినిష్ చేయొచ్చనే భావనలో బీజేపీ ఉందంటున్నారు.
వరుసగా 10 సంవత్సరాలు అధికారం లేకపోయినా అధికార పార్టీకి ధీటుగా నిలబడి తర్వాత అధికారంలోకి వచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. దశాబ్దాలుగా కార్యకర్తల బలంతో పటిష్టంగా ఉన్న టీడీపీని చీల్చడం కూడా అంత సులువేం కాదు. రాజకీయ వ్యూహాలను అమలుపరచడంలో దిట్ట అయిన చంద్రబాబు ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాలి మరి.!!












Click it and Unblock the Notifications