రాష్ట్రం కలిసుండాలని కోరుకున్నా -ఆ ఘనత వైఎస్సార్దే: విజయవాడ పర్యటనలో జగ్గారెడ్డి కామెంట్స్
తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పాత్ర, ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలపై వరుస వ్యాఖ్యలు చేస్తూ అధికార టీఆర్ఎస్ పార్టీకి టార్గెట్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పటికీ కలిసే ఉండాలని తాను కోరుకున్నట్లు చెప్పారు..
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుక్రవారం విజయవాడలో పర్యటించారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు వచ్చిన ఆయనకు ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ స్వాగతం పలికారు. అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఉమ్మడి ఏపీలో మూడు ప్రాంతాల(ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ)ను సమానంగా అభివృద్ధి చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిదే అని, రాష్ట్రం కలిసి ఉండాలని మొదటి నుంచి తాను కోరుకున్నానని జగ్గారెడ్డి అన్నారు.
ఏపీలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందన్నారు. ఏపీ ప్రజలు మరోసారి కాంగ్రెస్కు అవకాశం ఇవ్వాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మొదటి సారి టీడీపీ.. రెండవ సారి వైసీపీ అధికారంలోకి వచ్చాయంటే కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే..
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశించి.. ఒంట్లో పవర్ లేదు.. సీఎం కేసీఆర్కు చెంచాగిరీ చేసే మంత్రి.. ఇదేమీ కేసీఆర్కు విస్కీలో సోడా కలపడం కాదు.. అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై టీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగ్గారెడ్డి తన స్థాయిని మించి మాట్లాడుతున్నారని, హద్దుల్లో ఉండటం మంచిదని గులాబీ శ్రేణులు హెచ్చరించాయి.












Click it and Unblock the Notifications