తెలంగాణ నిర్ణయమైపోయిందని రాజ్ చెప్పారు: నాగం
న్యూఢిల్లీ: తెలంగాణ నిర్ణయం అయిపోయిందని తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ తమకు చెప్పారని భారతీయ జనతా పార్టీ నేత, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి ఆదివారం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తమ పార్టీ లక్ష్యమని తెలిపారు.
పార్టీ సహచర ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, యెండల లక్ష్మీ నారాయణ తదితరులతో కలిసి శనివారం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీలను వారి నివాసంలో కలిశారు.

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ బిజెపి పొత్తు పెట్టుకోదని, ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత నాగం పునరుద్ఘాటించారు. తెలంగాణ కోసం కట్టుబడి ఉన్న బిజెపి చిత్తశుద్ధితో ప్రజల్లోకి వెళుతుందని, అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారాన్ని చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం నియమించిన మంత్రుల బృందానికి తెలంగాణ బిజెపి తరఫున సమర్పించాల్సిన నివేదికను రాజ్నాథ్కు అందించారు. ఒక ఓటు - రెండు రాష్ట్రాల పేరుతో కాకినాడ తీర్మానం చేస్తూ తీసుకున్న నిర్ణయానికే బిజెపి కట్టుబడి ఉందని, ఈ మేరకు రాజ్నాథ్ తమకు మరోమారు హామీ ఇచ్చారని మీడియాకు నాగం తెలిపారు. కొత్త రాష్ట్ర ఏర్పాటుకు బిజెపి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ప్రజలందరికీ చెప్పాలని సూచించారన్నారు.
బిజెపి తరఫున జివోఎంకు ఒకే నివేదిక ఇవ్వనున్నట్లు నాగం తెలిపారు. తెలంగాణ బిల్లు పెట్టాలంటూ సుష్మా స్వరాజ్ పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీశారని, రాష్ట్ర ఏర్పాటులో జాప్యం చేయొద్దని మరోమారు డిమాండ్ చేయనున్నట్లు ఆమె తెలిపారని ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ చెప్పారు.
మరోవైపు బిజెపి సీమాంధ్ర ప్రాంత నాయకులు హరిబాబు నేతృత్వంలో పార్టీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషిని ఆయన నివాసంలో కలిశారు. సీమాంధ్ర సమస్యలు, భయాందోళనలు, నష్టాలపై పార్లమెంటులో చర్చించి, తగిన న్యాయం జరిగేలా చూడాలని ఈ సందర్భంగా వారు కోరారు.












Click it and Unblock the Notifications