బాబు, కేసీఆర్ పవర్ ఫైట్: సుప్రీంకి టీ, మాకే మేలని ఏపీ
హైదరాబాద్: విద్యుత్ వాటా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లంఘిస్తోదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లనుందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ సర్కారుపై న్యాయ పోరాటం చేసేందుకు తెలంగాణ నీటిపారుదల, విద్యుత్ శాఖలు సిద్ధమవుతున్నాయి. కేసీఆర్ ప్రకటన మేరకు పిటిషన్ను తయారుచేసే పనిలో నిమగ్నమయ్యాయి. మంగళవారం లేదా బుధవారమే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశముందని తెలుస్తోంది.
తెలంగాణలో విద్యుత్ కొరత ఏర్పడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కారణమని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టాన్ని గౌరవించడం లేదని, విభజన చట్టానికి తూట్లు పొడిచి, తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాను ఎగ్గొడుతోందని సుప్రీం కోర్టుకు చెప్పనున్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విషయంలో విఫలమవుతున్నాయంటూ కృష్ణా, గోదావరి బోర్డులపైనా ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు.
ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయని, తమ వాదనలను వినిపించుకోవడంలేదని పేర్కొనే అవకాశముంది. పిటిషన్లో ప్రస్తావించాల్సిన అంశాలపై తెలంగాణ నీటిపారుదల, విద్యుత్ నిపుణులు, రిటైర్డ్ అధికారులు, ప్రస్తుత అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముసాయిదా పిటిషన్ను అడ్వొకేట్ జనరల్ పరిశీలిస్తున్నారు. సీఎం ఆమోదముద్ర పడిన వెంటనే వచ్చే వారంలో సుప్రీంకోర్టులో పిటిషన్ను వేయనున్నారు.
విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఇవ్వనందునే తెలంగాణలో వ్యవసాయ రంగానికి తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడిందని, దీనిని ఎదుర్కోడానికే శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా తెలంగాణ నీటి వాటా ప్రకారమే విద్యుదుత్పత్తి చేశామని సుప్రీంకు తెలపనున్నారు. గోదావరి బేసిన్లోని సీలేరు కాంప్లెక్స్ నుంచి తెలంగాణకు రావాల్సిన వాటాను ఏపీ ఇవ్వడం లేదని, కృష్ణపట్నంలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ జెన్కో, తెలంగాణ రెండు డిస్కంలకు వాటాలున్నాయన్నారు.
కానీ ఆ విద్యుత్ను ఇవ్వడం లేదని చెప్పనున్నారు. కృష్ణపట్నంలోని తొలి 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య విద్యుదుత్పత్తి కార్యకలాపాలను (సీవోడి) కావాలనే అధికారికంగా ప్రకటించడం లేదని, శ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటిమట్టం 834 అడుగులు ఉండగా, కానీ ఉమ్మడి రాష్ట్రంలో దానిని దురుద్దేశంతో 854 అడుగులకు పెంచారని, అయినా శ్రీశైలం, నాగార్జునసాగర్ల నిర్వహణపై జారీ చేసిన జీవో 69, జీవో 233లకు లోబడే శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తున్నామని చెబుతారు.
జీవో 69 ప్రకారం చెన్నై తాగునీటి సరఫరా అవసరాలను తీర్చిన తర్వాత జల విద్యుదుత్పత్తి చేసుకోవచ్చునని, దీంతోపాటు ఎస్ఆర్బీసీ, తెలుగుగంగలకు కేటాయించిన 34 టీఎంసీలకు బదులు పోతిరెడ్డిపాడు ద్వారా 66.11 టీఎంసీల నీటిని ఏపీ తరలించిందని, ఆ తర్వాతే తెలంగాణ వాటా మేరకు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి వ్యవసాయ అవసరాల కోసం విద్యుదుత్పత్తి చేస్తున్నామని, ఏపీ కూడా తమ అవసరాల మేరకు జల విద్యుదుత్పత్తి చేసిందని చెప్పనున్నారు.
చెన్నై తాగునీటికి, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగలకు వాటి వాటా ప్రకారం పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా నీటిని మళ్ళించిన తర్వాత, శ్రీశైలంలో కనీస మట్టం 854 అడుగులు నిర్వహించాల్సిన అవసరం లేదని, 834 అడుగుల వరకు జల విద్యుదుత్పత్తి చేయవచ్చునని చెప్పనున్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు విద్యుత్లో 53.89 శాతం వాటా రావాలని, దానికి ఏపీ ప్రభుత్వం గండికొడుతోందని చెప్పనున్నారు.
మాకే మేలు
ఆంధ్రప్రదేశ్ సర్కారును సుప్రీంకోర్టుకు ఈడుస్తామని కేసీఆర్ చేసిన ప్రకటనను ఏపీ ఇంధన శాఖ అధికారులు పరోక్షంగా స్వాగతిస్తున్నారు. విద్యుత్ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళితేనే మంచిదని భావిస్తున్నారు. విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఎంత త్వరగా వ్యాజ్యం వేస్తే అంత మంచిదని, పరస్పరం విమర్శలు గుప్పించుకునే పరిస్థితి తప్పుతుందని, ఎవరైనా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉండాల్సి ఉంటుందని ఏపీ ఇంధన అధికారులు చెబుతున్నారు.