KCR వ్యాఖ్యలపై స్పందించిన గవర్నర్ తమిళి సై
భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగిన సభలో ముఖ్యమంత్రులు గవర్నర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ గవర్నర్ తమిళి సై ఖండించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ ను పూర్తిగా అవమానించారని ఆమె అభిప్రాయపడ్డారు. పరీక్షల సమయంలో ఎదురయ్యే భయాన్ని జయించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ 'ఎగ్జామ్ వారియర్స్'పేరుతో పుస్తకం రాశారు. రాజ్ భవన్ లో ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ ముఖ్యమంత్రలుగా ఉండి గవర్నర్ ను ఎలా అవమానిస్తారని ప్రశ్నించారు. ప్రొటోకాల్ కు సంబంధించి తాను పలుమార్లు మాట్లాడినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదన్నారు. కేసీఆర్ స్పందించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవానికి సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేదని గవర్నర్ వెల్లడించారు.
ఖమ్మం వేదికగా భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్ తోపాటు అఖిలేష్ యాదవ్, పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, తమ రాజకీయ అవసరాలకు వీరిని ఉపయోగించుకుంటోందంటూ విమర్శలు చేశారు.
తాజాగా ఈ విమర్శలనే తమిళి సై ఖండించారు. రాజ్యాంగబద్ధ పదవైన గవర్నర్ వ్యవస్థపై విమర్శలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో కొంతకాలంగా తమిళిసైకి, ప్రభుత్వానికి మధ్య సఖ్యత కొరవడింది. తమకు తెలియకుండా ఎలా పర్యటనలు జరుపుతారని, శాఖలపై సమీక్షలు చేస్తారని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.