ఉద్రిక్తం: వైయస్ జగన్ సమైక్య సభకు తెంలగాణ సెగ
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో శనివారం తలపెట్టిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సమైక్య శంఖారావం సభకు తెలంగాణ సెగ తగిలింది. నిజాం కళాశాల హాస్టల్ విద్యార్థులు స్టేడియం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి కాస్తా ఉద్రిక్తంగా మారింది.
ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కాస్తా తోపులాట కూడా జరిగింది. విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ విద్యార్థులు నల్ల జెండాలు ప్రదర్సించారు. పరిస్థితిని ముందుగానే ఊహించడంతో పోలీసులు విద్యార్థులను అదుపు చేయగలిగారు. ఎల్బీ స్టేడియాన్ని ఆనుకుని నిజాం కళాశాల హాస్టల్ ఉంటుంది. ఉస్మానియా విశ్వవిద్యాలంయ విద్యార్థులు ఎల్పీ స్టేడియం వరకు ర్యాలీని తీయడానికి ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు.

కాగా, సమైక్య శంఖారావం సభకు వివిధ జిల్లాల నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు తరలి వస్తున్నారు. రాయలసీమ నుంచి బస్సుల్లో కార్యకర్తలు చేరుకుంటున్నారు. కాసేపట్లో సభ ప్రారంభం కానుంది. రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల ద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు హైదరాబాదు చేరుకున్నారు.
వైయస్ జగన్ సమైక్య శంఖారావం సభకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తనిఖీలు చేసి ఎల్బీ స్టేడియంలోనికి పంపిస్తున్నారు. సమైక్య శంఖారావం సభ నేపథ్యంలో హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంటలకు ఇవి అమలులోకి వచ్చాయి. రాత్రి 9 గంటల వరకు అమలులో ఉంటాయి.












Click it and Unblock the Notifications