మాజీ సీఎం రోశయ్యకు హోం మంత్రి నాయిని క్షమాపణలు
హైదరాబాద్: తమిళనాడు గవర్నర్, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్యకు తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి క్షమాపణలు చెప్పారు. శుక్రవారం తెలంగాణ భవన్లో నాయిని మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లోని మల్లెపల్లి పారిశ్రామిక శిక్షణ సంస్ధ (ఐటీఐ)లో రోశయ్య తన అల్లుడికి ఎకరం భూమి ఇచ్చారని గతంలో తాను ఆరోపించానని గుర్తు చేశారు.
తన ఆరోపణల్లో నిజం లేదని తేలడంతో రోశయ్యకు క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించారు. మల్లేపల్లిలో కేటాయించిన భూమి.. రోశయ్య అల్లుడిది కాదని స్పష్టం చేశారు. అధికారుల నుంచి తప్పుడు సమాచారం రావడం వల్లనే ఆరోపణలు చేశానని పేర్కొన్నారు.

కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి బుధవారం ఆయన మల్లెపల్లి ఐటీఐలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తన అల్లుడికి చెందిన నియోనాటల్ ఇన్టెన్సివ్ కేర్ అండ్ ఎమర్జెన్సీస్(నైస్) ఇచ్చిన ఎకరా స్థలాన్ని వెనక్కి తీసుకుంటామని అన్నారు.
నగరంలో ఉన్న మల్లెపల్లి పారిశ్రామిక శిక్షణ సంస్ధ (ఐటీఐ)కు చెందిన 22 ఎకరాలపై కన్నేసిన మాజీ సీఎం రోశయ్య, అందులో నుంచి ఎకరా స్ధలాన్ని తన అల్లుడికి చెందిన నైస్ ఆసుపత్రికి కేవలం రూ. కోటికే ఇచ్చారని నాయిని ఆరోపించారు. ప్రభుత్వ శిక్షణ సంస్థకు చెందిన స్థలాన్ని ప్రైవేటు ఆసుపత్రికి కేటాయించడం చట్టవిరుద్ధమని అభ్యంతరం చెప్తూ నాటి కార్మిక, ఉపాధి కల్పన శాఖ సంచాలకులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని అన్నారు.
ఐనా సరే ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్య పట్టించుకోకుండా తన అల్లుడికి ఎకరా స్ధలం కట్టబెట్టారని అన్నారు. స్థలానికి చెల్లించాల్సిన రూ. కోటి కూడా ఇప్పటికీ ఉపాధికల్పన శాఖకు జమ చేయకుండా... నైస్ ఆసుపత్రి యాజమాన్యం భవానాన్ని నిర్మించుకుందని చెప్పారు.












Click it and Unblock the Notifications