టిలో 90మంది ఖరారు: డిగ్గీ, పార్టీకి 73 మంది గుడ్బై
న్యూఢిల్లీ: తెలంగాణలో 90 సీట్లకు అభ్యర్థుల జాబితా ఖరారైనట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ బుధవారం తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు అంశంపై తననెవరూ సంప్రదించలేదని అన్నారు.
తెరాసతో పొత్తు విషయం ఆ పార్టీనే అడగాలన్నారు. సీమాంధ్ర అభ్యర్థుల ఎంపికపై గురువారం స్క్రీనింగ్ కమిటీ భేటీ జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో త్వరలో ప్రచారం ప్రారంభిస్తామని చెప్పారు. మతతత్వ పార్టీ అయిన బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకుంటే లౌకికవాదం నుండి పక్కకు పోయినట్లే అన్నారు. తెలంగాణకు మొదట మద్దతు పలికి, ఆ తర్వాత చంద్రబాబు వ్యతిరేకించారన్నారు.
ఇప్పటి వరకు కాంగ్రెసుకు 73 మంది గుడ్ బై
రాష్ట్రంలో గత ఐదేళ్లలో 73 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణంతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పతనమవుతూ వచ్చింది. 2009 ఎన్నికల్లో గెలుపొందిన వారిలో 33 మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లారు. 27 మంది టిడిపిని ఆశ్రయించారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.
స్థానిక ఎన్నికల తరువాత మరికొంతమంది పార్టీని వీడే అవకాశం ఉందంటున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదని ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. అభ్యర్థులు దొరకగడం లేదనే విమర్శలను సీమాంధ్ర కాంగ్రెసు నేతలు కొట్టిపారేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణలో మాత్రం కాంగ్రెసు ఊపు మీద ఉంది.