ఆంధ్రా గోబ్యాక్ అనలేదు: ఏపిలో తొలిసారి తెలంగాణ మంత్రి ప్రెస్ మీట్
విజయవాడ: ఆంధ్రా గోబ్యాక్ అని తామెప్పుడూ అనలేదని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. జనతా పార్టీ మాజీ అధ్యక్షులు ఎంఏ రెహమాన్ స్మారక కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం విజయవాడకు వచ్చిన ఆయన ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయిని నర్సింహారెడ్డి రాష్ట్ర విభజనపై స్పందించారు.
అన్నదమ్ముల మధ్య ఐక్యత లేకపోవడం వల్లనే ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయామని అన్నారు. ఆంధ్రా గోబ్యాక్ అని ఎప్పుడూ అనలేదని ఆయన తెలిపారు. ఆంధ్రా వారిని తెలంగాణ నుంచి తామెప్పుడూ వెళ్లమనలేదని ఆయన చెప్పారు. ఉపాధి కోసం వచ్చి దోచుకునే వాళ్ళనే గోబ్యాక్ అన్నామని నాయిని నర్సింహారెడ్డి అన్నారు.
రెండు రాష్ర్టాల మధ్య పరస్పర సహకారం ఉంటేనే అభవృద్ధి సాధ్యమవుతుంది తప్ప దూషించుకుంటే ప్రయోజనం లేదని నాయిని అన్నారు. హైదరాబాద్ను విశ్వకేంద్రంగా తయారు చేస్తామని మంత్రి తెలిపారు. హైదరాబాద్లోని 8 అంతస్తుల కంట్రోల్ రూం నిర్మిస్తామని నాయిని చెప్పారు. మహిళలపై నేరాల నియంత్రణకు షీ టీంలు ఏర్పాటు చేశామని తెలిపారు.
షీ టీంలు మఫ్టీలో ఉంటారని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే అడ్డుకుంటారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మిషన్ కాకతీయకు రూ. 22వేల కోట్ల నిధులు కేటాయిస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. కాగా, రాష్ట్ర విభజన తర్వాత ఓ తెలంగాణ రాష్ట్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.