తెలంగాణ బోర్డర్లో ఏపీ అంబులెన్సులు మళ్లీ నిలిపివేత: బెడ్ దొరికినా: నో పర్మిషన్: గగ్గోలు
కర్నూలు: ఏపీ-తెలంగాణ మధ్య సరిహద్దు సమస్యలు మళ్లీ తలెత్తాయి. తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ నుంచి ఎలాంటి వాహనాలను కూడా అనుమతించట్లేదక్కడి పోలీసులు. చివరికి అంబులెన్స్లకు కూడా దారి ఇవ్వట్లేదు. ఫలితంగా- ఈ రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్కు తరలి వెళ్తోన్న అంబులెన్స్లను నిలిపివేయడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. తెలంగాణతో సరిహద్దులను పంచుకుంటోన్న కర్నూలు, సూర్యాపేట్ జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొంది.
తెలంగాణ బోర్డర్లో ఏపీ అంబులెన్సులు మళ్లీ నిలిపివేత#Coronavirus #andhrapradesh_cm #Telangana pic.twitter.com/JDt4rFScLD
— oneindiatelugu (@oneindiatelugu) May 14, 2021
కరోనా వైరస్ చికిత్స కోసం తిరుపతి నుంచి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లిన ఓ అంబులెన్స్ను ఈ తెల్లవారు జామున కర్నూలు జిల్లా సరిహద్దుల్లో నిలిపివేశారు తెలంగాణ పోలీసులు. సుమారు నాలుగు గంటల పాటు ఆ అంబులెన్స్ సరిహద్దు చెక్పోస్ట్ వద్దే నిలిచిపోయింది. హైదరాబాద్లోని జీవన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ బెడ్ లభించినప్పటికీ- పోలీసులు తమను వెళ్లనివ్వట్లేదంటూ బాధితురాలు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. కరోనా పేషెంట్ పల్స్ పడిపోయిందని, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గాయని చెప్పారామె. ఆయనను బతికించాలంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే తరహా పరిస్థితి ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లోని సూర్యాపేట్ జిల్లా కోదాడ మండలం రామాపురం వద్ద కూడా నెలకొంది. ఈ తెల్లవారు జాము నుంచే అంబులెన్స్ను తెలంగాణ పోలీసులు నిలిపివేశారు. ఆంక్షలను విధించారు. ఇదివరకు ఇలాంటి పరిస్థితే తలెత్తినప్పుడు తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకుంది. సరిహద్దుల్లో అంబులెన్స్ల రాకపోకలపై ఆంక్షలను ఎత్తి వేయాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల తరువాత అక్కడి ప్రభుత్వం కంప్లీట్ లాక్డౌన్ విధించిన నేపథ్యంలో.. ఏపీ-తెలంగాణ మధ్య మరోసారి అంబులెన్స్ల అడ్డగింత చోటు చేసుకుంటోంది. దీనిపై తెలంగాణ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కర్నూలు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications