అద్దె ఎఫెక్ట్: తెలంగాణకు రెండు ఇంజిన్ల కొత్త హెలికాప్టర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి, గవర్నర్, ఇతర అవసరాల కోసం కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశించారు. రెండు ఇంజిన్ల హెలికాప్టర్ కొననున్నారు.
ప్రస్తుతం సీఎం, గవర్నర్ ప్రయాణాల కోసం అద్దె హెలికాప్టర్ వినియోగిస్తున్నారు. ఢిల్లీ, తమిళనాడు నుండి వాటిని అద్దెకు తీసుకుంటున్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు హెలికాప్టర్లలో ఒకటైన బెల్... 2009 సెప్టెంబర్ 2న అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని తీసుకు వెళ్తున్న సమయంలో అటవీ ప్రాంతంలో కూలిపోయింది.
మరొకటి అగస్టా వెస్ట్ల్యాండ్ 2012 డిసెంబరులో బేగంపేట విమానాశ్రయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. ఆ తర్వాత కొత్త హెలికాప్టరును కొనలేదు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలు వేర్వేరుగా అద్దె హెలికాప్టర్లు వినియోగిస్తున్నాయి. ఇటీవల కొన్నిసార్లు హెలికాప్టర్లు అందుబాటులో లేకపోవడంతో కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.
దీనిపై సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు. రాష్ట్ర అవసరాల దృష్ట్యా కొత్త హెలికాప్టర్ అవసరమని గుర్తించారు. దీనిపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, వివిధ కంపెనీలన సంప్రదించి ప్రతిపాదలను రూపొందించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఏపీ వైమానిక సంస్థ ఉమ్మడిగా ఉంది.
అగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ ప్రమాదం అనంతరం రూ.68 కోట్ల బీమా డబ్బు అందింది. ఇవి ఉమ్మడి ఖాతాలో ఉన్నాయి. వైమానిక సంస్థ విభజన జరిగితే తెలంగాణ ప్రభుత్వానికి 42 శాతం వాటా కింద భీమా నిధులు వస్తాయి. ఈ నిధులతో పాటు మరికొన్ని కలిపి కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేయనున్నారని తెలుస్తోంది.