ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర: జగన్-రోజాలపై విరుచుకుపడ్డ తెలంగాణ నేతలు
వైసిపి అధినేత జగన్ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ప్రశాంత్ కిషోర్ రాసిచ్చిందేనని టిడిపి నేత వర్ల రామయ్య శుక్రవారం నిప్పులు చెరిగారు.
నంద్యాల: వైసిపి అధినేత జగన్ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ప్రశాంత్ కిషోర్ రాసిచ్చిందేనని టిడిపి నేత వర్ల రామయ్య శుక్రవారం నిప్పులు చెరిగారు.

మా ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర
ప్రజాస్వామ్య పద్ధతిలో ఏర్పాటైన తమ ప్రభుత్వాన్ని క్రిమినల్ ఆలోచనలతో పడగొట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఒకసారి ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఈసీకి వివరణ ఇచ్చి కూడా మళ్లీ అలాగే వ్యవహరిస్తున్నారన్నారు.

సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్లు పెట్టి ప్రభుత్వంపై ప్రశాంత్ కిషోర్, జగన్ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని వర్ల అన్నారు. వైసిపి చేస్తున్న దుష్ప్రచారాన్ని సుమోటోగా స్వీకరించి వారిపై కేసులు నమోదు చేయాలని డీజీపీ సాంబశివరావుకు విజ్ఞప్తి చేశారు. జగన్ నీచపు మాటలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

జగన్ను రాజకీయాల నుంచి వెలివేయాలి: ఎల్ రమణ
ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు సరికాదని తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ ఆరోపించారు. అసలు జగన్ను రాజకీయాల నుంచి వెలివేయాలని ఆయన అన్నారు. మంత్రి అఖిలప్రియపై రోజా వ్యాఖ్యలు సరికాదన్నారు.

జైలుకు వెళ్లినా మార్పు రాలేదు: మోత్కుపల్లి
చంద్రబాబుపై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని తెలంగాణ టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. జైలుకు వెళ్లినప్పటికీ జగన్ ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు.












Click it and Unblock the Notifications