సమైక్యాంధ్రలో ఆఖరు: టీ ఎవరి పరువు నిలిపేనో?
హైదరాబాద్: ఏప్రిల్ 30, 2014 తెలంగాణ ప్రజలకు కీలక దినం కాబోతుంది! దాదాపు మూడు కోట్ల మంది తెలంగాణ ప్రజలు తమ తొలి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటు వేయబోతున్నారు. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం లభించడం, జూన్ 2న అపాయింటెండ్ డేట్ వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ, సీమాంధ్రలు రెండు రాష్ట్రాలుగా జూన్ 2న విడిపోనున్నాయి. ఏప్రిల్ 30న తెలంగాణలో, మే 7న సీమాంధ్రలో ఎన్నికలు జరగనున్నాయి.
బుధవారం జరగనున్న ఎన్నికలతో తెలంగాణ ప్రజలు తమ తొలి ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. విభజన జరిగిన... విశాలాంధ్రప్రదేశ్లో ఇవే చివరి ఎన్నికలు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ను 22 మంది ముఖ్యమంత్రులు పాలించారు. ఎన్టీఆర్ మూడుసార్లు, ఎన్టీఆర్ మూడుసార్లు, నీలం సంజీవ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డిలు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
విశాలాంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో ఇప్పటి వరకు రెండుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ప్రస్తుత ఎన్నికలు రాష్ట్రపతి పాలనలోనే జరుగుతున్నాయి. ఈ ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్రాలు జూన్ 2న ఏర్పాటు కానున్నాయి.
ఇదిలా ఉండగా, తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 1669 మంది అభ్యర్థులు, 17 లోకసభ స్థానాల్లో 265 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం - భారతీయ జనతా పార్టీ కూటమిలు ప్రధానంగా ప్రభుత్వ ఏర్పాటు బరిలో ఉన్నాయి. 29వ రాష్ట్రంగా ఏర్పడబోతున్న తెలంగాణలో తమ ప్రభుత్వం ఉంటేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని ఏ పార్టీకి ఆ పార్టీలు చెబుతున్నాయి.
అయితే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం కనిపించడం లేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. దీంతో వైయస్సార్ కాంగ్రెసు, మజ్లిస్, లోక్ సత్తా పార్టీ, సిపిఐ, సిపిఎం, స్వతంత్రులు ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెరాసకు ప్రతిష్టనే కాదు...
ఈ ఎన్నికలు తెరాసకు చాలా కీలకం. ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కెసిఆర్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తమ వల్లే తెలంగాణ వచ్చిందని చెబుతున్న కెసిఆర్.. తెలంగాణకు న్యాయం తమతోనే సాధ్యమంటున్నారు. తెలంగాణ ఉద్యమ పోరాటంలో ముందున్న తెరాస... ఈ ఎన్నికల్లో గెలవకుంటే దానికి పరువు ప్రతిష్ట సమస్యనే కాకుండా, ఆ తర్వాత వచ్చేసార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీ ఎంత వరకు ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి. ఈ కారణంగానే కెసిఆర్ వ్యూహాత్మకంగా తన వ్యాఖ్యలకు పదును పెట్టారని అంటున్నారు.
బిజెపి - టిడిపి కూటమి
ఈ ఎన్నికల్లో బిజెపి-టిడిపి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలు చేశాయి. ఇందుకోసం మోడీ, పవన్ కళ్యాణ్, జీవిత, రాజశేఖర్ వంటి ప్రముఖులను కూడా ప్రచారంలోకి దింపారు. కెసిఆర్ పైన చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆర్ కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు ఆ వర్గాలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేశారు. ఇక బిజెపి తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించినందున ఆ పార్టీ కూడా ఎక్కువ స్థానాలు గెలిచే అంశంపై కన్నేసింది.
కాంగ్రెసుకు పరువు సమస్య
కాంగ్రెసు పార్టీకి ఇది పరువు సమస్యనే అని చెప్పవచ్చు. సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెసు పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోతుందని తెలిసినా.. ఇచ్చిన మాటకు కట్టుబడి తాము తెలంగాణ ఇచ్చామని కాంగ్రెసు పార్టీ చెబుతోంది. సీమాంధ్రలో ఎలాగు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోవడం, ఎక్కువ పార్లమెంటు సీట్లు గెలుచుకునే పరిస్థితి లేనందున.. తెలంగాణ ఇచ్చినందుకు కనీసం.. తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, పన్నెండుకు పైగా ఎంపీ స్థానాలు గెలుచుకోవాలనే ఉద్దేశ్యంతో ఉంది.
కీలక నేతలు పోటీ
తెలంగాణ ప్రాంతంలో కీలక నేతలు బరిలో నిలిచారు. ఈ కీలక నేతల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులు కూడా ఉన్నారు. తెరాస నుండి కెసిఆర్ (గజ్వెల్), కాంగ్రెసు నుండి దామోదర రాజనర్సింహ (ఆందోల్), గీతా రెడ్డి (జహీరాబాద్), పొన్నాల లక్ష్మయ్య (జనగాం), డికె అరుణ (గద్వాల్), బిజెపి నుండి కిషన్ రెడ్డి (అంబర్ పేట) టిడిపి నుండి ఆర్ కృష్ణయ్య (ఎల్బీ నగర్, సిఎం అభ్యర్థి) తదితరులు బరిలో నిలిచారు.
ఈ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కలలు కుంటున్న తెరాసకు అది అంత సులభమైనది కాదనే చెప్పవచ్చు. బిజెపి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం, టిడిపికి మంచి క్యాడర్ ఉండటం, కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇవ్వడం వంటి కారణాలు తెరాస మెజార్టీ పైన ప్రభావం చూపనున్నాయి. తెరాసకు ఉప ఎన్నికల్లో గెలిచే పార్టీ అనే పేరుంది. ఈ ఎన్నికలతో దానిని తుడిచి పెట్టి విజయఢంకా మోగిస్తుందా చూడాలి.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆ పార్టీ బలం అంతగా లేదని చెప్పవచ్చు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో తెరాసకు బలం లేదు. వరంగల్, కరీంనగర్, అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ వంటి జిల్లాల్లోనే ఆ పార్టీకి ఎక్కువగా బలం ఉంది. ఈ నేపథ్యంలో తెరాస తెలంగాణ తెచ్చామని చెప్పుకొని ఆ సెంటిమెంటునే నమ్ముకుంది.
తెరాసకు బలం లేవని భావిస్తున్న జిల్లాల్లోనే 65 స్థానాలు ఉన్నాయి. తెలంగాణలో 119 స్థానాలు ఉండగా.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 60 సీట్లు గెలుచుకోవాల్సి ఉంది. బలం లేదని భావిస్తున్న స్థానాల్లో ఏ మేరకు విజయం సాధిస్తుందో.. చూడాలి. 2009లో టిడిపితో పొత్తులో భాగంగా 45 స్థానాలు తీసుకొని కేవలం పదింట మాత్రమే గెలుపొందింది. అయితే, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం వేడెక్కడం, తెలంగాణ రావడం తెరాసకు ప్లస్ అని చెప్పవచ్చు.