ఫిబ్రవరిలో తెలంగాణ: యాష్కీ, చర్చపై కుట్ర: కెకె
తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో ఆశించిన స్థాయిలో చర్చ జరగకపోవడం వెనక సీమాంధ్రుల కుట్ర ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు కె. కేశవరావు అన్నారు. సమయం సరిపోలేదన్న సాకుతో చర్చకు గడువు కోరి విభజన ప్రక్రియను జాప్యం చేసేందుకు పన్నాగం వేస్తున్నారని ఆయన అన్నారు.
శనివారంనాడు ఆయన హైదరాబాదులో తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. తెలుగుజాతి రెండుగా చీలిపోయిందని, ఇక కలపడం ఎవరి తరం కాదని ఆయన అన్నారు. కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన అన్నారు.
తెలియని స్థితిలో ముఖ్యమంత్రి
అవగాహనా రాహిత్యం, అవివేకం, అహంకారం మూడు కలిపితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవుతారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అన్నారు కిరణ్ కుమార్ రెడ్డి ఏ ప్రాంతానికి చెందినవాడో తెలియని స్థితికి దిగజారిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి, నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ బిల్లుపై చర్చను భావోద్వేగాలు, ప్రాంతాలకు అతీతంగా చర్చించాలని ఆయన శాసనసభ్యులకు సూచించారు. ఇరు ప్రాంతాల్లో ఉన్న పార్లమెంటు సభ్యులు బిజెపితే సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన అన్నారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని ఆయన అన్నారు.