ప్రపంచంలోనే నెంబర్ 1, వారిని కట్టిపెట్టేశాను: కేసీఆర్
మహబూబ్ నగర్: ప్రపంచంలోనే తాము నెంబర్ వన్ పారిశ్రామిక విధానం తీసుకు వస్తాని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం వేములలో కేసీఆర్ కోజెంట్ గ్లాస్ కంపెనీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే రెండేళ్లలో కోజెంట్ సంస్థ నెంబర్ వన్ సంస్థ అవుతుందని చెబుతున్నారని, అది సంతోషమన్నారు. పరిశ్రమలకు సహకరిస్తామన్నారు. మరో 500 మందికి ఉద్యోగం ఇస్తామన్నందుకు సంతోషమన్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటికిప్పుడు పరిశ్రమలకు చాలా భూమి సిద్ధంగా ఉందన్నారు. సింగిల్ విండో విధానం, జీరో కరప్షథన్ ద్వారా కంపెనీలకు అనుమతులు ఇస్తామన్నారు. భారత దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ పారిశ్రామిక రాష్ట్రంగా చేస్తామన్నారు. కోజెంట్ సంస్థలో 70 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని చెబుతున్నారన్నారు. తెలంగాణలో ప్రతి ఇంటికి నాలుగేళ్లలో నీటిని ఇస్తామన్నారు. అందుకు వాటర్ గ్రిడ్ను తానే పర్యవేక్షిస్తున్నానని చెప్పారు.
రాబోయే మూడేళ్లలో ప్రతి గ్రామంలో ఒక లక్షా ఇరవై వేల మొక్కలు నాటుతామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా నా గుండెల్లో ఉందన్నారు. తాను మహబూబ్ నగర్ ఎంపీగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించానని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ పూర్తిగా నాశనమైందని, దానిని సరిదిద్దాల్సి ఉందన్నారు. రానున్న ఐదేళ్లలో ఇరవై అయిదువేల కోట్ల రూపాయలతో మైనర్ ఇరిగేషన్ సిస్టంను రిస్టోర్ చేస్తామన్నారు. మైనర్ ఇరిగేషన్ను పునరుద్దరింపజేస్తామన్నారు.
బంగారు తెలంగాణ తమ లక్ష్యమన్నారు. తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే ఒక్క కేసీఆర్ వల్లనో, ఒక్క ఎంపీ వల్లనో కాదని, అందరు ఎవరికి వారు పని చేయాలన్నారు. తెలంగాణలో తాను అద్భుతమైన పరిపాలన అందిస్తానని చెప్పారు. పచ్చని పంటలతో తెలంగాణ కళకళలాడాలన్నారు. ఆరునూరైన పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామన్నారు. కొందరు తన పట్ల చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారని, తెలంగాణ వ్యతిరేకులను కట్టిపెట్టి తాను సాధించానని కేసీఆర్ అన్నారు.