'ముత్యాలముగ్గు' నటుడు పిసుపాటి వెంకటేశ్వర రావు మృతి
హైదరాబాద్: పాతతరం సినీనటుడు, రంగస్థల కళాకారుడు పిసుపాటి వేంకటేశ్వర రావు సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయస్సు 90 ఏళ్లు. మూడు రోజులుగా అస్వస్థులుగా ఉన్న ఆయన కోఠిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య లక్ష్మి, ఐదుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు.
తేనెమనసులు, కన్నెమనసులు, ఆత్మీయులు, మరోప్రపంచం, సుడిగుండాలు, ముత్యాలముగ్గువంటి అనేక సినిమాల్లో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. మొదటి చిత్రం తేనెమనసులులో హాస్యనటుడిగా చిత్రరంగ ప్రవేశం చేసినా ఆ తరువాత క్యారెక్టర్ పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్నారు.
రంగస్థలంపై ఆయనకు మంచి అనుభవం ఉంది. ఇదేమిటి నాటకంలో ఆంధ్రనాటక కళాపరిషత్వారిచే ఉత్తమ కమెడియన్ అవార్డును, మురారి నాటకంలో నటనకుగాను ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఆయన సతీమణి లక్ష్మి జైలుసూపరింటెండెంట్గా పనిచేసి రిటైరైనారు.
వీణ, గాత్రం, నృత్యంలో ఆమె విశేష ప్రతిభావంతురాలు. కాగా మంగళవారం ఉదయం బన్సీలాల్పేట శ్మశానవాటికలో వేంకటేశ్వరరావు అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు.