కొత్తవారికి కాకినాడ కాజా లాంటిది.. ఏపీలోని ఆ లోక్సభ నియోజకవర్గం!!
ఆంధ్రప్రదేశ్లో ఆ లోక్సభ నియోజకవర్గానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఎంపీగా మొదటిసారి లోక్సభలో అడుగుపెట్టాలనే ఔత్సాహికులకు అది స్వర్గధామం అని చెప్పవచ్చు. ఏ దేశం నుంచి వచ్చినా, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా, ఏ గ్రామం నుంచి వచ్చినా అందరినీ అక్కున చేర్చుకుంటారు ఆ నియోజకవర్గ ప్రజలు. వారికి కల్లాకపటం ఉండదు. తమకు మంచి చేస్తారని భావిస్తే చాలు.. పార్టీ పేరు, గుర్తు కూడా చూడకుండా ఓటేసేస్తారు. అదే అందాల సాగర తీరాన హొయలొలికించే విశాఖపట్నం.

అన్ని రాష్ట్రాల ప్రజలకు ఆవాసం
విశాఖపట్నం ఒక కాస్మోపాలిటన్ నగరం. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు అక్కడ నివసిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు ఉండటంతోపాటు అందాల సాగరతీర నగరం కావడం కూడా ఒక కారణం. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంవీవీ సత్యనారాయణ ఆ నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని రంగంలోకి దిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మపై సంచలన విజయం సాధించారు.

2స్థానికులు కాకపోయినా ఆదరించారు
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన దగ్గుబాటి పురంధేశ్వరికానీ, ఆమెకు ముందు పోటీచేసి లోక్సభలో అడుగుపెట్టిన నేదురుమల్లి జనార్ధనరెడ్డికానీ, టి. సుబ్బారమిరెడ్డికానీ వీరెవరూ స్థానికులు కారు. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసిన ఎంవీవీఎస్ మూర్తి ఒక్కరే స్థానికులు. ఇలా ఎవరు వచ్చినా ఆదరించడానికి ప్రత్యేక కారణం తమ నగరం అభివృద్ధి చెందాలని, దేశం గర్వించదగ్గ సిటీగా ఉండాలనే ఆకాంక్ష ఒక్కటే ఇక్కడి ప్రజల్లో ఉంటుంది.

3పట్టణ ప్రాంత ప్రజలు కావడమే ముఖ్యకారణం
దీని పరిధిలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ నగర వాతావరణంలోనే ఉంటాయి. ఒక్క శృంగవరపు కోట కొంచెం దూరంగా ఉంటుంది. విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణం, గాజువాక, భీమిలీ నియోజకర్గం అంతా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులతో నిండివుంటుంది. ఎవరు అభివృద్ధి చేయగలరు? ఎవరికి ఓటు వేస్తే తమ నగరం ప్రశాంతంగా ఉంటుంది? తమ అవసరాలకు అనుగుణంగా పనిచేసేవారెవరు? తదితర విషయాలపై వారికి పూర్తిస్థాయిలో అవగాహన ఉండటంతో అన్ని పార్టీల తరఫున లోక్సభకు మొదటిసారి పోటీపడే అభ్యర్థులు విశాఖపట్నాన్ని ఎంపిక చేసుకుంటారు. అధినేతల ఆశీస్సులతో విశాఖ సీటు దక్కించుకుంటే లోక్సభలో అడుగుపెట్టినట్లేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఎన్నికలకు సంబంధించి గ్రామీణ ప్రజల ఆలోచనా దృక్పథానికి, పట్టణ ప్రజల ఆలోచనా దృక్పథానికి తేడా ఉంటుంది. ఫలానా పార్టీ, ఫలానా అభ్యర్థి అయితే అభివృద్ధి చేయగలరు అనే విశ్లేషణాత్మక ఆలోచన ఇక్కడి ఓటర్లలో ఉండటంతో కొత్తగా పోటీపడే అభ్యర్థులకు విజయం సులువవుతోంది.












Click it and Unblock the Notifications