టీడీపీకి 'పవన్'పై కొండంత ఆశ: నంద్యాల వ్యూహాత్మకమే!, రేప్పొద్దున జరిగేది అదే..
2019ఎన్నికల్లోను జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందన్న చర్చ జరుగుతోంది.
Recommended Video

విజయవాడ: క్షేత్రస్థాయి బలాబలాలతో సంబంధం లేకుండా ఏపీ రాజకీయాల్లో జనసేన ప్రస్తావన కీలకంగా మారింది. మూడేళ్ల వయసున్న పార్టీకి ఇప్పటిదాకా పవనే కర్త కర్మ క్రియ లాగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇకముందు ఈ పరిస్థితిలో మార్పు వస్తుందా? అంటే కచ్చితమైన సమాధానం చెప్పడం కష్టమే.
మరోవైపు జనసేనలో వన్ మాన్ షో కొనసాగుతుండటం టీడీపీకి కలిసొచ్చే అంశంగానే కనిపిస్తోంది. పేరుకు పార్టీ నిర్ణయమైనప్పటికీ.. పవన్ నిర్ణయాల మీద ఆ పార్టీ కార్యకర్తల ప్రభావం ఎంతనేది తెలియదు. ఇకముందు కూడా పవనే ఏక వ్యక్తి కేంద్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పవన్ మరోసారి టీడీపీతో జతకట్టే సూచనలు ఉన్నాయన్న చర్చ జోరందుకుంది. అంతిమ నిర్ణయం పవన్దే కావడం.. పార్టీ కార్యకర్తలెవరూ బాహాటంగా ఆయన్ను ధిక్కరించే సాహసం చేయకపోవడం.. బహుశా ఈ ప్రతిపాదనకు మార్గం సుగమం చేస్తుందేమో!

జనసేన-టీడీపీ పొత్తు:
ప్రత్యేక హోదా విషయంలో ఒక్క బీజేపీని మాత్రమే పవన్ కళ్యాణ్ సూటిగా విమర్శించారు. హోదా విషయంలో ఆయన మాట తీరు బీజేపీతో తెగదెంపులే అన్నట్లుగా సాగింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీతో ఆయన జతకలిసే అవకాశం లేదు. అదే సమయంలో టీడీపీతో మాత్రం ఆయన పొత్తు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. తొలి నుంచి ఆ పార్టీతో, అధినేత చంద్రబాబుతో ఉన్న సఖ్యత.. ఇప్పటికీ పవన్ అదే వైఖరిని అనుసరిస్తున్న తీరు దీనికి బలం చేకూరుస్తున్నాయి.

నంద్యాల, కాకినాడల్లో వ్యూహాత్మకం:
పవన్ టీడీపీ తొత్తుగా మారారన్న విమర్శలు ఆమధ్య చాలానే వినిపించాయి. ఒకవిధంగా జనసేన టీడీపీ నీడలో నడిచే పార్టీ అన్న విమర్శలు వచ్చాయి. ఈ అపప్రదను తొలగించుకోవడానికే నంద్యాల, కాకినాడ ఎన్నికల్లోపవన్ వ్యూహాత్మక మౌనం వహించారన్న వాదన ఉంది. ఈ రెండు ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలపకపోవడం ద్వారా.. ఆ పార్టీతో తనది అంశాలవారీ మద్దతే తప్ప మరొకటి కాదు అన్న సంకేతాలను పవన్ పంపించారని చెబుతున్నారు. టీడీపీకి సహకరిస్తున్నామన్న ముద్రను తొలగించుకోవడానికే పవన్ ఈ ఎన్నికల పట్ల మౌనం వహించారనేది చాలామంది చెబుతున్న మాట.

టీడీపీయే ఉసిగొల్పిందా?:
నిజానికి ఏపీలో ఏ సమస్య తెరపైకి వచ్చినా సరే.. ప్రతిపక్షం వైసీపీ కన్నా ముందు జనసేన త్వరితగతిన స్పందిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఇది కూడా టీడీపీ ప్లానే అన్నవారు లేకపోలేదు. జనసేనను వెనుక నుంచి ఉసిగొల్పి ప్రత్యర్థికి అవకాశం లేకుండా చేసేందుకే పవన్ ను తెర పైకి తీసుకొచ్చారన్న వాదన ఉంది. పేరుకే వేరే పార్టీ అయినప్పటికీ.. పవన్ టీడీపీ ఆత్మతోనే పనిచేస్తున్నారనేది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. పార్టీ పట్ల ఒకవేళ వ్యతిరేకత పెరిగినా.. అది ప్రత్యర్థి ఖాతాలోకి కాకుండా, తమ అనుయాయి ఖాతాలోకి వెళ్తే.. భవిష్యత్తులో పరోక్ష మద్దతు పొందవచ్చనేది టీడీపీ ఆలోచనగా చెబుతున్నారు.

నమ్మకంగా టీడీపీ:
2019లో టీడీపీతో జనసేన పొత్తు కొనసాగుతుందనే సంకేతాలు టీడీపీ నుంచి అప్పుడే మొదలయ్యాయి. 'పవన్ కళ్యాణ్ 2014లో మాకు మద్దతు తెలిపారు. అదే పొత్తు మున్ముందు కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన కొన్ని సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు, ప్రభుత్వం వాటిని పరిష్కరించే బాధ్యత తీసుకుంటుంది' అని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2019లో జనసేన తమతోనే ఉంటుందన్న విశ్వాసం ఆయన మాటల్లో వ్యక్తమవుతోంది. ఇది ఆయన ఒక్కడి అభిప్రాయమే కాదు.. టీడీపీ మొత్తం జనసేనతో పొత్తు పట్ల విశ్వాసంతో ఉన్నారనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

జనసేన కార్యకర్తల్లో మరో అభిప్రాయం:
టీడీపీ-జనసేన పొత్తుపై జనసేన కార్యకర్తల్లో కొంత ప్రతికూలత ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆ పార్టీకి చెందిన ఓ కార్యకర్త ఈ పొత్తుపై పెదవి విరిచారు. ఇది ఒకరకంగా పవన్ ఇమేజ్ ను తగ్గిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2014లో పొత్తు ఉన్నంత మాత్రాన 2019లోను అదే రిపీట్ అవాలని ఏమి లేదన్నారు. ప్రస్తుతం తాము పార్టీ బలోపేతం పైనే ఫోకస్ చేశామని, 2019ఎన్నికల్లో ఎవరితో పొత్తు అనే ఆలోచనలో ప్రస్తుతం పార్టీ లేదని స్పష్టం చేశారు. అంతేకాదు, పార్టీ స్వతంత్రంగా పోటీ చేయడానికే మొగ్గుచూపుతుందని కామెంట్ చేయడం గమనార్హం.

అన్నిచోట్ల పోటీ కష్టమే?:
రెండేళ్ల కాల వ్యవధిలో అన్నిచోట్ల బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జనసేనకు కష్టమనే చెప్పాలి. సంస్థాగతంగా ఇప్పుడిప్పుడే కొంత పుంజుకుంటున్న పార్టీకి 175స్థానాల్లో అభ్యర్థులు దొరకడమే కష్టమేనన్న అభిప్రాయాలున్నాయి. దీనికి తోడు పవన్ కూడా తమకు పట్టున్న నియోజకవర్గాల్లోనే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కూడా టీడీపీకి కలిసొచ్చే విషయమే అంటున్నారు. పొత్తు లేకుండా టీడీపీకి బయటి నుంచి మద్దతు తెలిపేందుకే పవన్ ఈ వ్యూహాన్ని అనుసరించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల సమయానికి తేలిపోతుంది?:
ఎన్నికలు సమీపిస్తే గానీ రాజకీయ పార్టీల అసలు వ్యూహాలు బయటపడే అవకాశం లేదు. అందరు భావిస్తున్నట్లుగా పవన్ టీడీపీతో పొత్తుకే జై కొడితే.. అది ఆ పార్టీకి నష్టమేనన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇంకా టీడీపీ నీడలోనే కొనసాగితే.. పార్టీకి సొంత స్టాండ్ అంటూ లేకుండా పోతుందన్న వాదన ఉంది. దానికి తోడు వైసీపీకి చెక్ పెట్టేందుకే జనసేన తెర మీదకు వచ్చిందన్న వాదనకు కూడా బలం చేకూరుతుంది. ఎన్నికలు సమీపిస్తే కానీ ఈ ఊహాగానాల్లో నిజానిజాలెంతనేది ఇప్పుడే నిర్దారించలేం.












Click it and Unblock the Notifications