తన జాగ్రత్తలో తానుంటున్న చంద్రబాబునాయుడు!!
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు 2024 అసెంబ్లీ ఎన్నికలను అంత తేలిగ్గా తీసుకోవడంలేదు. ఎవరినీ తక్కువ అంచనా వేయడంలేదు. చివరకు ఆయన కేఏ పాల్ ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారంటే ఎంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 2019 ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామనే నమ్మకం ఉన్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ తమ పార్టీ అభ్యర్థులను ఆర్థికంగా దిగ్బంధనం చేయడంతోపాటు పలు కారణాలవల్ల ఓటమిపాలయ్యామనేది చంద్రబాబు భావన. ఈసారి అటువంటి పరిస్థితి ఎదురవకుండా ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కఠిన పరిస్థితుల మధ్య టీడీపీ
తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేనివిధంగా అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఏపీలో బలంగా ఉన్న వైసీపీ, టీడీపీ రెండు పార్టీల్లో ఏది బలహీనపడినా తాను ఆ స్థానంలోకి రావడానికి బీజేపీ ఎదురు చూస్తోంది. అందుకు అన్నిరకాల వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. గతం గతః ఏదన్నా జరగనీ.. ప్రస్తుతానికి మాత్రం ఎన్నికల సమాయానికి బీజేపీ నుంచి ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉంటే చాలు.. అనే భావనలో చంద్రబాబు ఉన్నారు. అందుకే ఆయన ఆ పార్టీతో సయోధ్య కోసం ప్రయత్నిస్తున్నారు. అటువైపు నుంచి స్పందన ఏమిటనే విషయంలో స్పష్టత రాలేదు.

ప్రజల మనసులో టీడీపీ ఉందని బాబు భావన
ప్రజల్లో చంద్రబాబుకు అధికారం కట్టబెట్టాలనే భావన బలంగా ఉందని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా వారిని ఓటింగ్ కేంద్రాల వరకు తీసుకురాగలిగితే చాలు.. అధికారం టీడీపీకి దక్కుతుందనే యోచనలో బాబు ఉన్నారు. అందుకే తనకు ఎటువంటి గొడవలు వద్దని, రాష్ట్రంలో అధికారంలోకి రావడమే తన లక్ష్యమని, తనకు అడ్డంకులు కల్పించకుండా ఉంటే చాలనే ఉద్దేశంతో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బీజేపీతో సయోధ్య కోసం
బీజేపీతో సయోధ్య కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించినా, ఫలించకపోయినా తన జాగ్రత్తలు తాను తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఒకవేళ పవన్కల్యాణ్ ప్రయత్నాలు ఫలించి తెలుగుదేశం-జనసేన-బీజేపీతో కూటమి ఏర్పడితే ఎటువంటి అనుమానం లేకుండా కూటమి అధికారంలోకి వచ్చేస్తుందని అందరూ భావిస్తున్నారు.
అలా కాకుండా వైసీపీకి ఎన్డీయే మద్దతు ప్రకటించడం, లేదంటే తటస్థంగా ఉన్నా చాలనేది బాబు భావన. ఒకవేళ ఎన్డీయే జగన్కు లోపాయికారీగా సహకారం అందిస్తే దాన్ని ఎదుర్కోవడానికి ఇప్పటినుంచే అన్నిరకాల వ్యూహాలను చంద్రబాబు సిద్ధం చేసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు 2024 ఎన్నికలను అత్యంత వ్యూహాత్మకంగా, అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోబోతున్నారనేది స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications