బాబుకు సారీ చెప్పను, కేంద్రమంత్రితో టీడీపీ చర్చలు: విజయసాయి, రాజీనామాలు వెనక్కి!
Recommended Video

న్యూఢిల్లీ/అమరావతి: సీఎం చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యలకు ఎట్టి పరిస్థితుల్లోను క్షమాపణలు చెప్పేది లేదని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి తేల్చి చెప్పారు. తమ పార్టీ అధినేతపై చేసిన వ్యాఖ్యలకు సాయి వెంటనే క్షమాపణ చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి స్పందించారు. చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యలు ప్రజలకు తెలియాల్సిన అవసరముందని, అందుకే మీడియా ముందు చెప్పానని, ఈ విషయంలో తాను క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదన్నారు. అలా చెప్పే ఉద్దేశ్యం కూడా తనకు లేదన్నారు.

టీడీపీ ఎంపీలు కేంద్రమంత్రితో చర్చలు
టీడీపీ ఎంపీలు బుధవారం పార్లమెంటు ఒకటో నెంబర్ ద్వారం వద్ద మెట్ల పైనే ఓ కేంద్రమంత్రితో మంతనాలు జరిపారని విజయసాయి విమర్శించారు. లాలూచీ రాజకీయాలు చేస్తోంది టీడీపీనే అని, తమను ఎలా అంటారన్నారు. తనను నేరగాడు అని చెప్పిన సీఎంనే తాను సవాల్ చేస్తున్నానని, ఎక్కడైనా సరే బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. యూటర్న్ అంకుల్ నిర్వహించిన అఖిల పక్ష సమావేశం విఫలమైందన్నారు.

యూటర్న్లు వద్దు
జగన్ మాత్రమే ప్రత్యేక హోదా సాధించగలరని విజయసాయి చెప్పారు. ఏపీకి హోదా కోసం చంద్రబాబు యూటర్న్లు తీసుకోవద్దన్నారు. వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే వారం అయిదు రోజులు సమావేశాలు జరుగుతున్నాయని, అప్పుడు అవిశ్వాసం నోటీసు చర్చకు వస్తుందని ఆశిస్తున్నామన్నారు.

బతకాలంటే నీరు కావాలంటున్నారు
వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అవిశ్వాసం నోటీసు చర్చకు వచ్చేలా అన్నాడీఎంకే ఎంపీలు సహకరించడం లేదన్నారు. మాది తాగునీటి సమస్య.. మీది బతుకు సమస్య అని, బతకాలంటే ముందు తాగునీరు కావాలని, అందుకే తాము తమ సమస్య పైనే నిలబడతామన్నారు. 29న సుప్రీం కోర్టులో కావేరీ బోర్డుపై తీర్పు వస్తున్నందున అప్పుడు మీకు సహకరించడంపై ఆలోచిస్తామని చెప్పారని తెలిపారు.

రాజీనామాలు వెనక్కి తీసుకెళ్లారు
ఇదిలా ఉండగా, వైసీపీ ఎంపీలు రాజీనామా లేఖలు పట్టుకుని బుధవారం పార్లమెంట్కు వచ్చారు. లోకసభ నిరవధిక వాయిదా పడితే వాటిని ఇద్దామనుకున్నారు. నిరవధిక వాయిదా పడకపోవడంతో రాజీనామాలు వెనక్కి తీసుకు వెళ్లారు. వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్రెడ్డి, అవినాశ్ రెడ్డి రాజీనామా లేఖలపై సంతకాలు చేశారు. వరప్రసాదరావు మాత్రం సంతకం లేకుండా లేఖతో వచ్చారు. 'లోకసభలో నా స్థానానికి రాజీనామా చేస్తున్నాను' అని ఏకవాక్య లేఖను స్పీకర్ ఫార్మాట్లో తెచ్చారు. సభ సోమవారానికి వాయిదాపడడంతో ఎంపీలు తమ రాజీనామా లేఖలను వెనక్కు తీసుకువెళ్లారు.

విజయసాయిది తప్పే, చంద్రబాబు అలా చేయాలి
ఇదిలా ఉండగా, చంద్రబాబు తల్లిదండ్రులను కించపరిచేలా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ శాసన సభా పక్ష నేత విజయసాయి రెడ్డి ఖండించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఎవరున్నా గౌరవించేలా ప్రవర్తించాలన్నారు. రాజకీయ విభేదాలుంటే ఆ కోణంలో విమర్శలు చేయాలని, హుందాతనం మరువొద్దన్నారు. అలాగే అమిత్ షా రాసిన లేఖకు చంద్రబాబు కూడా అదే విధంగా అధ్యక్షుడి హోదాలో సమాధానం చెప్పాల్సింది అన్నారు. రాష్ట్రానికి అన్యాయం అంటూ ప్రజలను టీడీపీ రెచ్చగొడుతోందన్నారు.

విజయసాయి ఉపసంహరించుకోవాలి
చంద్రబాబుపై విజయసాయి చేసిన వ్యాఖ్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పుబట్టారు. వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. హోదా సాధనకు కలిసి ఉద్యమించాల్సిన సమయంలో టీడీపీ, వైసీపీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడం దుర్మార్గమన్నారు. బడా పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు ఎంపీలు అవుతున్నారని, వీరికి ప్రజా సమస్యలు పట్టడం లేదన్నారు. కొందరు ఉద్యమాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని, వారంతా ఆంధ్రా ద్రోహులుగా మిగిలిపోతారన్నారు.












Click it and Unblock the Notifications