వైఎస్ జగన్ ఆదేశాల ధిక్కరణ?? అన్నీ సొంత నిర్ణయాలే తీసుకుంటున్న బడా నిర్మాతలు?
ప్రజలకు అందుబాటు ధరల్లో వినోదం ఉండాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెచ్చిన ఆదేశాలను కొంతమంది బడా నిర్మాతలు ధిక్కరిస్తున్నారంటూ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిర్ణయించిన ధరలు ఒకటైతే అమలవుతోంది మరొకటిగా ఉందని, ఆదేశాలను ధిక్కరించేవారిపై కఠినచర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

రూ.150, రూ.200 అంటూ దిల్ రాజు ప్రకటన
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమా థియేటర్ల టికెట్ ధరలకు సంబంధించి ఒక ప్రకటన చేశారు. భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ సినిమాలు మినహా అన్ని సినిమాలకు ఇకనుంచి ఒకే ధర ఉండేలా ఖరారు చేసినట్లు ప్రకటించారు. హైదరాబాద్, విశాఖపట్నం లాంటి నగరాల్లో సింగిల్ స్క్రీన్ ధర రూ.150, మల్టీప్లెక్స్ రూ.200 గా నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇకనుంచి ఏ సినిమా విడుదలైనా ఇవే ధరలు కొనసాగుతాయన్నారు. ఎఫ్-3 సినిమాకు ధరలు తగ్గించామని, విక్రమ్, మేజర్ సినిమాలు కూడా అవే ధరలకు ప్రదర్శితమయ్యాయని చెప్పారు.

ఏపీలో అభ్యంతరాలు
దిల్ రాజు ప్రకటనపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం కనపడుతోంది. ప్రజలకు అందుబాటులో వినోదం ఉండాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించింది. దీనిపై సినీ పరిశ్రమ నుంచి మాత్రమే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రేక్షకులకు తగ్గింపు ధరలతో సినిమాను ప్రదర్శించడానికి కథానాయకులు, నిర్మాతలు, దర్శకులు ఎవరూ ముందుకు రాలేదు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం తన నిర్ణయానికి కట్టుబడి తగ్గింపు ధరలతోనే సినిమాను ప్రదర్శింపచేసింది. ఇది తమకు నష్టమంటూ నిర్మాతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన ఖాతరు చేయలేదు.

ఇంత ధరలంటే ఎవరు ముందుకొస్తారు?
కార్పొరేషన్ పరిధిలోని ఏసీ థియేటర్లలో రూ.100, రూ. 80 గా నిర్ణయించారు. ప్రీమియం కేటగిరీలో రూ.125, రూ.100గా నిర్ణయించారు. ప్రీమియం కాకపోతే రూ.20 తక్కువగా టికెట్ ధర ఉంటుంది. మల్టీప్లెక్స్ లతో సమానంగా సౌకర్యం కల్పించే సింగిల్ థియేటర్లను ప్రత్యేక థియేటర్లుగా పరిగణిస్తామని, దీనిపై ఒక జీవోను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని కేంద్ర ప్రభుత్వం అరికట్టలేకపోతున్న సమయంలో రూ.200, రూ.150 పెట్టి సినిమాలు చూడటానికి ఎవరూ ముందుకు రారని సినీ పరిశ్రమకే చెందిన పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఎవరు నిర్ణయించిన ధరలతో సినిమాను ప్రదర్శించాలి?
నిర్మాతలందరూ సమావేశమై ఒక నిర్ణయం తీసుకొని తక్కువ ధరలకే ముందుకు వస్తున్నామని ప్రకటించారు. వీరు నిర్ణయించుకున్న ధరలతో సినిమాను ప్రదర్శించాలా? లేదంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో సినిమా ప్రదర్శించాలా? అని చిన్న పిల్లలను అడిగినా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే సినిమాను ప్రదర్శించాలని చెబుతారు. భారీ బడ్జెట్తో సినిమాలు విడుదలైనప్పుడు ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసుకున్నప్పుడు మాత్రం ప్రత్యేక జీవో విడుదల చేసి వారం నుంచి 10 రోజులపాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తూ వస్తోంది. అయితే ఈ ధరలు చూసి ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు. ఓటీటీలు అందుబాటులోకి రావడంతో వారు వినోదాన్ని అతి తక్కువ ధరకు సొంతం చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications