ఈ కాలం కవి ఇక లేడు: పైడి తెరేష్ బాబు మృతి

హైదరాబాద్‌: ప్రముఖ కవి, రచయిత, గాయకుడు సంగీత కారుడు, దళిత సాహితీవేత్త పైడి తెరేష్ బాబు(51) సోమవారం కన్నుమూశారు. కొంత కాలంగా లివర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లివర్‌ పూర్తిగా చెడిపోయి పరిస్థితి విషమించడంతో సాయంత్రం 6 గంటల సమయంలో ఆయన మృతి చెందారు.

తెరేశ్‌ బాబు మరణవార్త తెలుసుకున్న కవులు, కళాకారులు, ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో యశోద ఆసుపత్రికి చేరుకుని ఆయనకు నివాళులు అర్పించారు. ఆయనకు భార్య తాహెర సుల్తానా, కుమారుడు ప్రణయ్‌ చంద్ర, కుమార్తె సాయి రితిక ఉన్నారు. తెరేశ్‌బాబు స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని గద్దల కుంట.

ఆయన తల్లిదండ్రులు సుబ్బమ్మ, శాంతయ్య. శాంతయ్య పద్యాలు రాయడం, పాడడం చేయడంతో తెరేశ్‌బాబు కవిత్వంపై మక్కువ పెంచుకున్నారు. తండ్రి నుంచి వచ్చిన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన అనతికాలంలోనే సమాజం మెచ్చే కవిగా ఎదిగారు. మొదటి సారిగా కొత్తగూడెంలోని ఆలిండియా రేడియోలో వ్యాఖ్యాతగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు.

20 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లోని ఆలిండియా రేడియోలో ఉద్యోగిగా స్థిరపడ్డారు. అప్పటినుంచి నగరంలోని అశోక్‌నగర్‌లో నివసిస్తున్నారు. తెలుగులో గజల్స్‌ రాసి వాటికి ట్యూన్స్‌ చేసి పాడడంలో తైరేశ్‌ బాబు నిష్ణాతుడు. రచనల ద్వారా కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ముఖ్యంగా అల్పపీడనం, కావడి కుండలు, హిందు మహాసముద్రం, నేను నా వింతల మారి ప్రపంచం వంటి ఎన్నో రచనలు చేశారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన పైడి తెరేశ్‌ బాబు తెలంగాణకు గట్టి మద్దతుదారుగా నిలిచారు.

Pydi Theresh Bbau

అంతేకాక.. ఆంధ్రా ప్రాంతంలో కవులు, కళాకారులను కలిసి తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచేలా కృషి చేశారు. సీమాంధ్రలో జరిగిన సమైక్య ఉద్యమాన్ని బూటక ఉద్యమంగాపేర్కొంటూ 56 రోజుల పాటు ఫేస్‌బుక్‌లో విభజన గీత పేరుతో ప్రచారం చేశారని మిత్రులు తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు.

తెలంగాణ ఉద్యమానికి సంఘీభావంగా కవిత్వం రాసిన ప్రముఖ కవి పైడి తెరేశ్‌బాబు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా తెలంగాణ ప్రజల గోస తెలిసిన మనిషని కేసీఆర్‌ గుర్తు చేశారు. ‘కావడికుండలు' అనే కవితా సంకలనం తీసుకు రావడంలో తెరేశ్‌ బాబు చొరవ చూపారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రజా గాయకుడు గద్దర్‌, విప్లవ రచయిత వరవరరావు, గేయ రచయిత, గాయకులు గొరేటి వెంకన్ననివాళులు అర్పించారు. ప్రముఖ రచయిత దళిత సాహితీ వేత్త పైడి తెరేశ్‌ బాబు రేడియోలో శబ్దానికి తరంగం లాంటి వారని ప్రజా గాయకులు గద్దర్‌ అన్నారు. ఆధునిక కవుల్లో అరుదైన కవి పైడి తెరేశ్‌ బాబు అని విప్లవ రచయిత వరవర రావు కొనియాడారు.

దళితుల అభ్యున్నతికై ఎన్నో రచనలు చేశారన్నారు. మహాకవి సముద్రుడిని భూమ్మీదకు ప్రవహింప చేసిన మహాధుని అని తెరేశ్‌ బాబును కత్తి పద్మారావు కొనియాడారు. గుండెలోతుల్లోంచి ఆకాశం ఆంచుల వరకు ధ్వనించిన కవి మారుతం.. ఆతనికి మరణం లేదని పద్మారావు అన్నారు. తెలంగాణ, తెలుగు ప్రజలు చిరకాల మిత్రుడిని, హితుడిని కోల్పొయారని జయధీర్‌ తిరుమలరావు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+