ఒకే ఫ్రేమ్ లో చంద్రబాబు-రేవంత్..! ఢిల్లీలో అరుదైన సీన్స్..!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో ఒకే చోట ప్రత్యక్షమయ్యారు. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యాక ఏపీ ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు ఇక్కడ సీఎం అయ్యారు. అనంతరం వీరిద్దరూ నేరుగా కలిసి చర్చలు జరుపుకున్న సందర్భాలు లేవు. మర్యాదపూర్వక భేటీలు మాత్రమే జరిగాయి. ఈ మధ్య బనకచర్ల ప్రాజెక్టు వివాదం తర్వాత వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కూడా సాగింది. ఈ నేపథ్యంలో ఇవాళ వీరిద్దరూ ఒకే చోట కనిపించారు.
ఇవాళ కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ను కలిసేందుకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులతో పాటు ఇంజనీర్ల బృందం ఢిల్లీ వెళ్లింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని జలశక్తిశాఖ కార్యాలయంలో ఇరురాష్ట్రాల సీఎంలతో మంత్రి సీఆర్ పాటిల్ భేటీ అయ్యారు. చంద్రబాబు, రేవంత్రెడ్డితో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ సమావేశమై కీలక విషయాలపై చర్చించారు. ఈ భేటీలో ఇరురాష్ట్రాల నీటిపారుదలశాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే ఇరు రాష్ట్రాల సీఎస్లు, నీటిపారుదలశాఖ కార్యదర్శులు, ఇంజినీర్లు కూడా ఇందులో ఉన్నారు.

ఏపీలో నిర్మిస్తున్న బనకచర్ల-పోలవరం ప్రాజెక్టు వల్ల నదుల అనుసంధానం జరుగుతుందని, ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుందని చంద్రబాబు చెప్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. మిగులు జలాల పేరిట కృష్ణా నది నీటిని ఈ ప్రాజెక్టుకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యావరణశాఖ కూడా బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు నిరాకరించింది. దీంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఢిల్లీకి వచ్చి చర్చించాలని కేంద్రం సూచించింది.

దీంతో ఇవాళ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులతో కూడిన బృందాలు జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కలిసి ఈ ప్రాజెక్టుపై చర్చించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య తాజాగా జరగాల్సిన భేటీ రద్దయింది. ఈ భేటీలో బనకచర్ల మాత్రమే అజెండాగా చర్చిద్దామని చంద్రబాబు ప్రతిపాదించగా.. తెలంగాణ మాత్రం దీనికి తిరస్కరించింది. ఇప్పుడు జల్ శక్తి మంత్రి వద్ద జరిగే చర్చల ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకునేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్దమవుతున్నారు.












Click it and Unblock the Notifications