దమ్ముంటే బాబును అడ్డుకోండి: కెసిఆర్కు రేవంత్, ఆంధ్రా వాళ్లేనని..
హైదరాబాద్: తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఖరారైందని తెలియనగానే తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలన్నది ప్రభుత్వ నిర్ణయం అయితే గవర్నర్ కలుగజేసుకోవాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ అది కెసిఆర్ మనసులో మాట అయితే.. దమ్ముంటే కొడుకు కె తారక రామారావు, అల్లుడు హరీష్ రావును పంపి చంద్రబాబు యాత్రను అడ్డుకోవాలని అన్నారు. నిజాం వారసుడిలా కెసిఆర్ ప్రవర్తించి చంద్రబాబు యాత్రకు ఆటంకాలు కల్పిస్తే.. పటేల్ వారసులం అయిన తాము యాత్రను సజావుగా సాగేలా చూస్తామని చెప్పారు.
టిఆర్ఎస్ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారని విమర్శించారు. సిఎం కెసిఆర్ తన అసమర్థ, నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి యత్నిస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలను పూర్తిగా పక్కన పెట్టేశారని ఆరోపించారు.
కెసిఆర్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపారాల్లో భాగస్వాములుగా కొనసాగుతున్న వారంతా ఆంధ్రా ప్రాంతానికి చెందినవారేనని అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబును టిఆర్ఎస్ నేతలు అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు.