కేసీఆర్ మెచ్చుకున్నా.. జగన్ మారడా? : సోమిరెడ్డి, ‘టీడీపీలోకి మరో 4గురు ఎమ్మెల్యేలు’
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. ఓ వైపు పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను చేపట్టి జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరు తెచ్చుకుంటున్నారని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి మాత్రం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని సోమిరెడ్డి విమర్శించారు. జగన్ ఎప్పటికీ తన వైఖరిని మార్చుకోడా? అని ప్రశ్నించారు.
వేలాది ఎకరాలకు సాగునీరందించే పట్టిసీమను విమర్శించడం తగదని హితవు పలికారు. జగన్ ఇకనైనా తన వైఖరిని మార్చుకోవాలని కోరుతున్నట్టు తెలిపారు. పట్టిసీమను తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అభినందించారని.. కానీ, జగన్ ఒక్కరే పట్టిసీమను వ్యతిరేకిస్తున్నారని సోమిరెడ్డి అన్నారు.
తెలుగుదేశం పార్టీ యువనేత లోకేష్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పార్టీ అభ్యన్నతికి కృషి చేస్తున్నారని అన్నారు. నారా లోకేష్ అవసరం రాష్ట్రానికి ఉందని సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. కేబినెట్లోకి లోకేష్ను తీసుకోవాలన్న నిర్ణయాన్నితాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.
టీడీపీలోకి మరో నలుగురు జగన్ పార్టీ ఎమ్మెల్యేలు: కెఈ
కర్నూలు: మరో నలుగురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. బీసీల అండతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉందని కేఈ కృష్ణమూర్తి వివరించారు.
పోలీస్వ్యవస్థలో సంస్కరణలు: చినరాజప్ప
శ్రీకాకుళం: పోలీస్వ్యవస్థలో సంస్కరణలు తెస్తామని హోంమంత్రి చినరాజప్ప చెప్పారు. పోలీస్శాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని, ఉచిత ఇసుక విషయంలో రాజీ పడేది లేది చినరాజప్ప స్పష్టం చేశారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టామన్నారు. నేరాలను అదుపులోకి తెచ్చామని చెప్పారు.