ప్రతిపక్షం రాద్ధాంతం: బాలకృష్ణ, వారికి పాదాభివందనం: చంద్రబాబు
హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు. మంగళవారం ఉదయం తెలుగుదేశం పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ప్రారంభమైన ఈ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు ముందుగా పతాకావిష్కరణ చేశారు. అనంతరం కేక్ కేట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఓ చరిత్ర అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతామన్నారు.
On Telugu Desam Party's Foundation Day, I vow to ensure that TDP will stand for people & infuse new ideas for growth.
— N Chandrababu Naidu (@ncbn) 29 March 2016
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తనకు రెండు కళ్లని, ఇరు రాష్ట్రాల అభివృద్ధికీ తాను కృషి చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్ని సమస్యలు ఎదురైనా, ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుని పార్టీ నిలబడిందంటే, అందుకు కార్యకర్తల కృషే కారణమని అన్నారు. వారికి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు.
తెలుగువారికి అన్ని రంగాల్లో న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్న చంద్రబాబు, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ యుగపురుషుడని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే ఆయన పార్టీని ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు.
బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ చరిత్రను సృష్టించిన పార్టీ టీడీపీయేనని ఆయన వివరించారు. ఓ ప్రాంతీయ పార్టీగా పుట్టిన పార్టీ దేశ రాజకీయాలనే శాసించే స్థాయికి ఎదిగిందని అన్నారు. ఎన్టీఆర్ తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవం కోసమే తెలుగు దేశం పార్టీ ఏర్పడిందని వ్యాఖ్యానించారు.
టీడీపీ 35వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. విభజన సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూస్తుంటే ప్రతిపక్షం అనవసర రాద్ధాంతం చేస్తోందని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్నివిధాలా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.
ఆ తర్వాత ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చంద్రబాబు చేరుకుని ఎన్టీఆర్కు నివాళులర్పించారు. మరోవైపు ఆవిర్భావ వేడుకులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఈరోజు సాయంత్రం 5.00 గంటలకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.