అధికారముందని అడ్డుకుంటే, ఇక ఓడిస్తాం: మంత్రికి టిడిపి హెచ్చరిక
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టిడిపి నేతలు మంత్రి, బీజేపీ నేత మాణిక్యల రావుపై నిప్పులు చెరుగుతున్నారు.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టిడిపి నేతలు మంత్రి, బీజేపీ నేత మాణిక్యల రావుపై నిప్పులు చెరుగుతున్నారు. కేంద్రం, రాష్ట్రాలలో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఇక్కడ మాత్రం ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని మండిపడుతున్నారు.
చదవండి: లగడపాటి మాటలతో కంగుతిన్న చంద్రబాబు
మంత్రి మాణిక్యాల రావు టిడిపి శ్రేణులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్విమర్శించారు.
మాధవరంలో నీరు-చెట్టు పథకంలో మట్టి తవ్వకాలు సాగిస్తుంటే మంత్రి అడ్డుకోవడాన్ని చైర్మన్ తప్పు పట్టారు. జగన్నాథపురంలో మంత్రి మనుషులు తవ్వకాలు సాగిస్తే అడ్డుకోకుండా టిడిపి అన్న కారణంగానే మాధవరంలో మంత్రి అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

కక్ష సాధింపు చర్యలు
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మద్యం ఉండకూడదని మంత్రి వ్యాఖ్యానించడం కొందరిపై ఆయనకు ఉన్న కక్ష సాధింపు చర్యలే కారణమని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ప్రజల విరాళాలతో స్థాపించిన మహిళా కళాశాలను ఓ సంస్థకు మంత్రి అప్పగించడం తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు క్షమించరన్నారు.

హోదా రాకపోవడంతో రూ.200 కోట్లు రాకుండా పోయాయి
తాడేపల్లి గూడెంలో రూ. 150 కోట్లతో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టేంందుకు ప్రభుత్వం, కలెక్టర్ నిర్ణయం తీసుకుంటే దానికి మంత్రి అడ్డుపడ్డారని విమర్శించారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీ ఇవ్వడం వల్ల తాడేపల్లిగూడెంనకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.200 కోట్లు వచ్చే అవకాశాన్ని కోల్పోయామన్నారు.

అధికారముందని అడ్డుకుంటే.. టిడిపి నేతల హెచ్చరిక
పట్టణానికి వేసవిలో మంచినీరు అందించేందుకు కాల్వలో కరకట్ట వేస్తే అడ్డుకున్నారని చెప్పారు. తాగునీటి అవసరాలను అడ్డుకోవడం మంత్రికే చెల్లిందని మండిపడ్డారు. అధికారం ఉంది కదా అని కక్షసాధింపు చర్యలు తీసుకుంటే సహించేది లేదన్నారు.

మద్దతు కూడగట్టుకుందాం
రెండేళ్ల కాలాన్ని సద్వినియోగం చేసుకుని, నియోజకవర్గంలో టిడిపి మద్దతు కూడగట్టుకోవాలని శ్రీనివాస్ హితవు పలికారు. వైస్ చైర్మన్ ప్రసాద్ మాట్లాడుతూ.. తమ మద్దతుతోనే నెగ్గిన మంత్రి మాణిక్యాల రావు ఇప్పుడు ప్రతిపక్షంగా వ్యవహరించడం బాధాకరమన్నారు.
కౌన్సిలర్ మారిశెట్టి సుబ్బారావు మాట్లాడుతూ.. గోయెంకా మహిళా కళాశాల స్థాపన కోసం ఆ రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి డబ్బులు పోగు చేశామన్నారు. విరాళాల్లో గోయెంకా ఎక్కువ మొత్తంలో ఇచ్చారన్న ఉద్దేశంతో ఆ పేరు పెట్టారని, అంతకు మించి వారి పాత్ర లేదన్నారు. ప్రజావిరాళాలతో ఏర్పాటు చేసిన కళాశాలను మరో సంస్థకు అప్పగించడం మంత్రికి తగదన్నారు.

గెలిపించే.. మేమే ఓడిస్తాం
సమావేశంలో కోప్షన్ సభ్యుడు, టిడిపి సీనియర్ నేత బడుగు పెద్ద మాట్లాడారు. ఎక్సైజ్ పాలసీని ఆమోదించిన కేబినేట్ సమావేశంలోనే మద్యపాన నిషేధంపై మంత్రి మాణిక్యాలరావు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. కక్ష సాధింపు కోసమే నియోజకవర్గంలో మద్యం విధానంపై మంత్రి మాట్లాడుతున్నారన్నారు. మంత్రి వ్యవహారశైలి ఇలాగే ఉంటే గెలిపించిన తామే ఓడిస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications