చంద్రబాబు ఇంటిపై దాడి కేసు-మాజీ మంత్రి జోగి రమేష్ కు తాత్కాలిక ఊరట..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు కరకట్ట ఇంటిపై దాడికి ప్రయత్నించిన ఘటనలో మాజీ మంత్రి జోగి రమేష్ కు ఇవాళ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ నెల 16 వరకూ అరెస్టు కాకుండా ఆదేశాలు ఇచ్చింది.

2021లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇంటిపైకి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ దాడికి వెళ్లారు. చంద్రబాబు ప్రభుత్వంపై చేసిన విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కరకట్టపై ఉన్న ఆయన ఇంటి వద్దకు వెళ్లి నానా హంగామా సృష్టించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అరెస్టు తప్పదని భావించిన జోగి రమేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నిన్న విచారణ జరిగింది. అనంతరం ఇవాళ్టికి వాయిదా పడింది.
ఇవాళ మరోసారి జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ నెల 16 వరకూ ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. 16న జరిగే విచారణలో జోగి రమేష్ బెయిల్ పై హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇప్పటికే అగ్రిగోల్డ్ భూముల ఆక్రమణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేష్ తనను రెండు రోజుల్లో అరెస్టు చేస్తారని చెప్పారు.












Click it and Unblock the Notifications