"రాయలసీమలో హైకోర్టు" పై రౌండ్ టేబుల్: పార్టీల ప్రస్తావనతో ఉద్రిక్తత
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'రాయలసీమలో హైకోర్టు' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలో ఐవైఆర్ కృష్ణారావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని కోస్తాంధ్రలో ఉందని అందువల్ల హైకోర్టుని రాయలసీమలో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత తప్పకుండా ఉందన్నారు. అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్లు ఏర్పాటుకు ఉన్న సాధ్యసాధ్యాలపై ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించారు. అయితే ఈ సమావేశంలో పార్టీల ప్రస్తావన వచ్చిన సందర్భంగా వక్తల మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఇదే సమావేశంలో పాల్గొన్న ఏపీ మాజీ సీఎస్ అజయ్ కల్లం మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణే అవినీతి విరుగుడుకు ప్రధాన మందు అని అజయ్ కల్లం అభిప్రాయపడ్డారు. పాలకులు తమకు ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటే అందుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శేషశయన రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంలోని అన్ని శాఖలతో పాటు రాష్ర్టంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే సమగ్ర పణాళికలు అవసరమని అన్నారు. రాయలసీమలో హైకోర్టు ఆవశ్యకతకు సంబంధించిన వినతి పత్రాన్ని త్వరలో కేంద్రానికి సమర్పిస్తామని ఈ సదస్సులో పాల్గొన్న వక్తలు ఈ సందర్భంగా తెలిపారు.
అయితే ఈ సమావేశంలో పార్టీల ప్రస్తావన రావటంతో స్పల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ విషయమై వక్తల మధ్య పరస్పరం వాగ్వాదం జరిగింది. అయితే ఈ సమయంలో జన చైతన్య వేదిక సభ్యులు పూనుకొని అందరికీ నచ్చచెప్పడంతో వివాదం సద్దుమణిగినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications