శ్రీశైలంలో తీవ్ర ఉద్రిక్తత .. టీడీపీ అభ్యర్థి ప్రచారాన్నిఅడ్డుకునేందుకు వైసీపీ యత్నం
ఏపీలో రాజకీయం ఉద్రిక్త పరిస్థితులకు కారణం అవుతుంది. ఇక కర్నూలు జిల్లాలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ , వైసీపీల ప్రచార పర్వంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రచారంలో భాగంగా ఇరు వర్గాలు తారసపడిన సందర్భంలో నెలకొన్న హైడ్రామా పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది.టీడీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ,వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి ఇద్దరూ ప్రచారంలో ఎదురుబొదురు కావటంతో ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
టీడీపీ అభ్యర్థి ప్రసంగాన్ని అడ్డుకునే యత్నం చేసిన వైసీపీ
టీడీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు . దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. నంద్యాల లోక్సభ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డితో కలిసి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఆత్మకూరులో రోడ్డు షో నిర్వహించారు. సాయంత్రానికి రోడ్డు షో లింగాయితివీధి నుంచి అమ్మవారిశాల వద్దకు చేరుకుంది.సరిగ్గా అదే సమయంలో వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి కాన్వాయ్ అక్కడికి చేరుకోవటంతో అసలు రగడ మొదలైంది .
ఎమ్మెల్యే ప్రసంగం అడ్డుకునేందుకు టపాసులు పేల్చి, మైకుల్లో కేకలు వేసిన వైసీపీ శ్రేణులు
అక్కడే ఉన్న ఎమ్మెల్యే బుడ్డా కాన్వాయ్ను దాటి వెళ్లేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఇందుకోసం బెదిరింపులకు దిగారు. గొల్లపేట సెంటర్లో బుడ్డా ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. డ్రమ్స్ మోగించారు. టపాసులు కాల్చి శబ్దాలు చేశారు. మైకుల్లో చెవులు చిల్లులు పడేలా కేకలు వేశారు.ఇక టీడీపీ నేతలు వైసీపీ నేతల తీరుతో రగిలిపోయారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
నన్ను కెలికితే ముంపు మండలాలే కాదు.. భద్రాచలాన్ని కూడా తెచ్చుకుంటా .. కేసీఆర్ ను హెచ్చరించిన బాబు
గంట పాటు హైడ్రామా.. పోలీసుల ఎంట్రీతో సద్దుమణిగిన వివాదం ..
గంట పాటు జరిగిన హైడ్రామాలో ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో పరిస్థితి గమనించిన ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, ఎస్ఐ రమేశ్బాబు, సీఆర్పీఎఫ్ బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి. పోలీసులు పరిస్థితి అదుపు చేసే క్రమంలో తోపులాట జరిగింది. దీంతో వైసీపీ బృందాలు టీడీపీ కాన్వాయ్లోకి రాకుండా రోప్ బృందాలు అడ్డుకున్నాయి. లేకుంటే అక్కడ పెద్ద రగడ జరిగేది. ఆగ్రహావేశాలతో ఊగిపోయిన శ్రేణులు హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా పోలీసులు పరిస్థితి అదుపు చేశారు. ఇక ఎమ్మెల్యే రాజశేఖరరెడ్డి తన కాన్వాయ్ను ముందుకు కదిలించి వివాదం సద్దు మణిగేలా చేశారు . దీంతో అక్కడ ఉన్న పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.