విశాఖలో బలప్రదర్శనకు వైసీపీ రెడీ-పోటీగా రంగంలోకి పవన్, టీడీపీ-నగరంలో టెన్షన్
ఏపీలో అమరావతి రైతుల పాదయాత్ర నేపథ్యంలో మూడు రాజధానులపై స్వరం పెంచిన అధికార వైసీపీ రేపు విశాఖలో భారీ స్ధాయిలో గర్జన ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఇప్పటికే నాన్-పొలిటికల్ జేఏసీ పేరుతో ఓ వేదికను ఏర్పాటు చేయడంతో పాటు కమిటీలు, రౌండ్ టేబుల్ భేటీలతో ఉద్యమాన్ని ఎగదోసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో అమరావతి రాజధానికి మద్దతుగా ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా విశాఖలో రేపు పర్యటించబోతున్నారు.

రేపే విశాఖలో వైసీపీ గర్జన
మూడు రాజధానులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికార వైసీపీ రేపు విశాఖలో భారీ స్ధాయిలో గర్జన ర్యాలీ నిర్వహించేందుకు సిద్దమవుతోంది. వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అధికార పార్టీ ఏర్పాటు చేసిన నాన్-పొలిటికల్ జేఏసీ సహకరిస్తోంది. ఇందులో భాగంగా రేపు విశాఖ అంబేద్కర్ విగ్రహం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ పాదయాత్ర ద్వారా మూడు రాజధానులపై ఉత్తరాంధ్ర స్వరం వినిపించాలని వైసీపీ పట్టుదలగా ఉంది. ముఖ్యంగా అమరావతి రైతుల పాదయాత్ర ఇక్కడికి వచ్చేలోపే ఈ ర్యాలీ నిర్వహణతో హెచ్చరికలు పంపేందుకు వైసీపీ రెడీ అవుతోంది.

రేపే పవన్ కళ్యాణ్ టూర్
అదే సమయంలో అక్టోబరు 15 నుంచి మూడ్రోజుల పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటించాలని నిర్ణయించారు. ఉత్తరాంధ్రలో జనవాణితో పాటు పలు కార్యక్రమాల కోసం పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నారు. పవన్ రాక సందర్భంగా ఉత్తరాంధ్రకు చెందిన జనసేన నేతలు విశాఖకు వస్తున్నారు. వీరితో పవన్ బిజీబిజీగా గడపబోతున్నారు. అసలే అమరావతి రాజధానికి అనుకూలంగా ఉన్న పవన్ కళ్యాణ్ వైసీపీ గర్జన రోజే ఇక్కడికి వస్తుండటంతో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

రేపే టీడీపీ ఉత్తరాంధ్ర భేటీ
అదే సమయంలో టీడీపీ కూడా విశాఖలోనే ఉత్తరాంధ్ర పార్టీ నేతల భేటీ నిర్వహిస్తోంది. ఇప్పటికే విశాఖలో రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకంగా అమరావతి రాజధానికే మద్దతునిస్తున్న టీడీపీపై స్ధానికంగా వ్యతిరేకత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సేవ్ ఉత్తరాంధ్ర నినాదంతో దీన్ని కౌంటర్ చేయాలని చంద్రబాబు తమ నేతలకు సూచించారు. దీంతో రేపటి భేటీలో వైసీపీ ఉత్తరాంధ్రలో చేస్తున్న విధ్వంసానికి వ్యతిరేకంగా సేవ్ ఉత్తరాంధ్ర గళం వినిపించేందుకు టీడీపీ నేతలు సిద్దమవుతున్నారు. ఇలా ఒకే రోజు వైసీపీ గర్జన, పవన్ టూర్, టీడీపీ ఉత్తరాంధ్ర భేటీతో రేపు విశాఖలో ఏం జరగబోతోందనే టెన్షన్ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications