రాజమండ్రిలోకి పవన్ వస్తారా - సభకు అనుమతి నిరాకరణ : ముందస్తు హౌస్ అరెస్ట్ లు- ఆంక్షలు..!!
కొద్ది రోజులు గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ ప్రభుత్వం అన్నట్లుగా సాగుతున్న వ్యవహారం ఈ రోజు కొత్త మలుపు తీసుకుంటోంది. పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటన విషయంలో టెన్షన్ కొనసాగుతోంది. ఏపీలో రోడ్ల దుస్థితిపైన జనసేన సెప్టెంబర్ తొలి మూడు రోజులు డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించింది. రోడ్ల ఫొటలతో ఈ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ రోడ్ల బాగుకు ప్రభుత్వం ముందుకు రాకుంటే గాంధీ జయంతి నాడు రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదానం చేయాలని జనసేన నిర్ణయించింది.
బహిరంగ సభకు పోలీసులు నో
ఇందు కోసం పార్టీ అధినేత తూర్పు గోదావరితో పాటుగా అనంతపురం జిల్లాల్లో జరిగే శ్రమదానం కార్యక్రమాల్లో పాల్గొనాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా.. రాజమండ్రి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ పైన గుంతలు పూడ్చే విధంగా శ్రమదానం చేయాలని నిర్ణయించారు. అయితే, ఆ బ్యారేజి ఆర్ అండ్ బీ పరిధిలోకి రాదని..అక్కడ టెక్నాలజీ ఫాలో కాకుండా ఎలా పడితే అలా గుంతలు పూడ్చితే బ్యారేజికి ప్రమాదమని చెబుతూ అక్కడ అనుమతి నిరాకరించారు. దీంతో.. జనసేన తన కార్యక్రమాన్ని రాజమండ్రి సమీప హుకుంపేటలోని బాలాజీపేటకు మార్చుకుంది.
జనసేన నేతల ముందస్తు హౌస్ అరెస్టులు
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఉదయం పవన్కల్యాణ్ రాజమండ్రి ఎయిర్పోర్టుకు వచ్చి, అక్కడి నుంచి బాలాజీపేట చేరుకుంటారని ప్రకటించింది. బాలాజీపేటలో పవన్ శ్రమదానం కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన పోలీసులు.. బహిరంగ సభకు అనుమతి నిరాకరించారు. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా మరోచోట సభ జరుపుకోవాలని చెప్పారు. అయితే సభ అక్కడే జరుపుతామని జనసేన నాయకులు చెప్పడంతో.. దీనిని విఫలం చేసే ప్రయత్నాలను పోలీసులు చేపట్టారు. నాయకులకు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్లు చేస్తూ.. లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు చేస్తున్నారు.
రాజమండ్రిలో పవన్ వస్తారా..ఏం జరుగుతోంది
దీంతో..రాజమండ్రిలో జనసేనాని కేవలం శ్రమదానంలో పాల్గొని తిరిగి వెళ్లిపోతారా.. లేక, బహిరంగ నిర్వహణ కోసం ప్రయత్నిస్తారా అనేది తేలాల్సి ఉంది. అయితే, పోలీసులు మాత్రం రాజమండ్రి విమానాశ్రయం నుంచి అనేక ప్రాంతాల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసారు. జనసేన నేతలకు ముందుగానే బహిరంగ సభల్లో పాల్గొనకుండా నోటీసులు జారీ చేసారు. దీంతో..రాజమండ్రిలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కనిపిస్తోంది. రాజమండ్రి తరువాత పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా కొత్త చెరువు చేరుకుని శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటారు.
Recommended Video
శ్రమదానంకు ఓకే..సభకు మాత్రం నో
కొత్తచెరువు జంక్షన్ వద్ద సభలో మాట్లాడతారు. కాగా, జనసేన శ్రమదానం నిర్వహిస్తామని చెప్పిన రెండు ప్రదేశాల్లో ప్రభుత్వం వెంటనే రోడ్ల మరమ్మతులను పూర్తి చేసింది. దీనిపై స్పందించిన నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రి జగన్కు కృతజ్ఞతలు చెప్పారు. 'పవన్ కల్యాణ్ శ్రమదానంతో రోడ్లకు మరమ్మతులు చేస్తామన్న ప్రాంతాల్లో రాత్రికి రాత్రే పనులు చేస్తున్నారు. మిగిలిన రోడ్ల సంగతి కూడా చూడండి' అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజమండ్రి..అనంతపురం పర్యటన - ఆయన చేసే ప్రసంగాలు..చోటు చేసుకొనే పరిణామాల పైన రాజకీయంగా ఉత్కంఠ నెలకొని ఉంది.