బాబుకి ఓటేస్తే ఇలాగా: కన్నీళ్లు పెట్టుకున్నగ్రామస్థులు
అంగళూరు: తెలుగుదేశం పార్టీకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఓటు వేసి తాము నీడలేని వారిమయ్యామని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాబుకు ఓటేస్తే తమకు మరింత నష్టపరిహారం వస్తుందని భావించామన్నారు.
ఎన్నికలకు ముందు చంద్రబాబు కూడా అదే మాట చెప్పారన్నారు. ఇప్పుడు మాత్రం తమకు నిలువనీడ లేకుండా చేస్తున్నారన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని అంగళూరులో రెండు రోజులుగా ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు గ్రామస్థులను ఆదేశించారు.
అంతేకాదు, బుల్డోజర్లతో ఇళ్లు కూలగొడుతున్నారు. దీనిపై గ్రామస్థులు మండిపడుతున్నారు. కళ్లముందే ఇళ్లు కూలుతుంటే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. స్థానికుల నిరసన మధ్యనే అధికారులు ఇళ్లును కూల్చి వేస్తున్నారు. తమకు మరింత పరిహారం ఇచ్చాకే ఇళ్లు ఖాళీ చేస్తామని అంగళూరువాసులు అంటున్నారు.

అంగళూరు పోలవరం ముంపు గ్రామం. గ్రామస్థులు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు పక్కా ఇళ్లు కట్టిస్తామని, ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇప్పుడు కనీసం మంచినీటి సౌకర్యం, రోడ్లు లేని స్థలాల్లోకి తరుముతున్నారని విమర్శించారు.
పట్టిసీమ రైతులకు భారీ పరిహారం ఇచ్చి, తమకు తక్కువ పరిహారం ఇస్తున్నారన్నారు. అదేమిటని ప్రశ్నిస్తే తాము గిరిజనేతరులమని చెబుతున్నారన్నారు. తమకు పూర్తి పరిహారం ఇచ్చే వరకు అంగళూరు గ్రామం నుండి కదిలేది లేదని చెప్పారు.
అంగళూరు కీలకమన్న కలెక్టర్
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అంగుళూరు కీలక ప్రదేశమని కలెక్టర్ అరుణ్ కుమార్ అన్నారు. ప్రాజెక్టు పనులు కొనసాగేలా ప్రజలు సహకరించాలని కోరారు. 78 కుటుంబాలకు 2007-08లోనే పరిహారం ఇచ్చామని, ఇందిరా ఆవాస్ యోజన కింద ఇళ్లు మంజూరు చేశామని కలెక్టర్ తెలిపారు.
గ్రామంలో ప్రస్తుతం ఎవరూ నివసించక పోయినా పనులు ప్రారంభించగానే వచ్చి గొడవ చేస్తున్నారన్నారు. అంగుళూరు గిరిజన వ్యవసాయ భూమికి మరో చోట భూ బదలాయింపు మిగిలే ఉందన్నారు. నిర్వాసితులు పునరావాస ప్యాకేజీలో లేని డిమాండ్లు పెట్టారని, ప్రభుత్వం వారి డిమాండ్లను పరిశీలిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications