చంద్రబాబు తెలంగాణ లేఖ వల్లే ఇలా: టిజి వెంకటేష్
కర్నూలు/ తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం వల్లనే సీమాంధ్రలో ఉద్యమం తీవ్రమైందని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. శాసనసభలో తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకించేందుకే తాము రాజీనామాలు చేయలేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. అవసరమైతే సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.
ముందుగా రాజీనామాను ఆమోదింపజేసుకునేది తానే అని ఆయన చెప్పారు. కాంగ్రెసు సహా అన్ని పార్టీలు ఓట్లు, సీట్ల కోసం ప్రాంతాలకు అనుకూలంగా మాట్లాడాయని ఆయన విమర్శించారు. సమైక్యాంధ్ర జెఎసినే తాము అధిష్టానంగా భావిస్తున్నట్లు తెలిపారు. అన్ని పార్టీల అధినేతలు ద్వితీయ శ్రేణి నేతలను నిలువునా ముంచారని ఆయన విమర్శించారు. సీమాంధ్రలో ప్రభుత్వోద్యోగులు జీతాల్లేకుండా చేస్తున్న ఉద్యమాన్ని నీరు గార్చవద్దని కోరారు.

సీమాంధ్రలోని ఆరు కోట్ల మంది ప్రజలతో కాంగ్రెసు పార్టీ ఆడుకుంటోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రలోని చేతివృత్తులవారు సైతం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆయన గురువారంనాడు అన్నారు. తిరుపతిలోని తుడా సర్కిల్లో క్రిస్టియన్ మైనారిటీల దీక్షలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భూమన నడిరోడ్డుపై బుట్టలు అల్లుతూ నిరసన తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికే సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించాలని కుట్ర పన్నుతున్నారని ఆయన విమర్శించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు నాయుడు సోనియా గాంధీకి సహకరించారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications