సమర్థత చంద్రబాబుకే ఉంది: టిజి వెంకటేష్ ప్రశంస
హైదరాబాద్: సీమాంధ్రను స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే సామర్థ్యం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మాత్రమే ఉందని రాయలసీమకు చెందిన మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. చంద్రబాబుతో భేటీ తర్వాత ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఆయన టిడిపిలో చేరడానికి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని, బిజెపితో పనులు చేయించుకునే సామర్థ్యం చంద్రబాబుకు ఉందని, అందుకే తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు.
రాష్ట్ర విభజన విషయంలో తాము ఓడిపోలేదని, తమను ఓడగొట్టారని, తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానమే తమను ఓడించిందని, అందుకే కాంగ్రెసులో ఉండలేనని చెప్పి బయటకు వచ్చానని ఆయన చెప్పారు. తమను చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో చేరాలని, దానివల్ల పార్టీ బలోపేతమవుతుందని చెప్పారని, అందుకే చంద్రబాబును కలిశామని ఆయన అన్నారు. చంద్రబాబు పార్టీలో చేరే విషయానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే విషయంపై మాట్లాడారని ఆయన అన్నారు.
తమ పార్టీలో చేరాలనే మాట మాట్లాడకుండా అభివృద్ధి గురించే చంద్రబాబు మాట్లాడారని, అది చంద్రబాబుకు అభివృద్ధి చేయాలనే దృష్టికి నిదర్శనమని ఆయన అన్నారు. హైదరాబాద్ను సింగపూర్లా అభివృద్ధి చేశానని, సీమాంధ్రను కూడా అలా అభివృద్ధి చేస్తానని చెప్పారని ఆయన అన్నారు. రాయలసీమ అభివృద్ధి బాధ్యతను తీసుకోవాలని తాము చంద్రబాబును కోరామని ఆయన చెప్పారు.
సీమాంధ్రకు రెండు రాజధానులు ఏర్పాటు చేయాలని సూచించామని, అందుకు చంద్రబాబు కృషి చేయాలని చెప్పామని, కర్నూలును రాజధానిగా చేయాలని, దీనివల్ల భవిష్యత్తులో ప్రస్తుతం ఎదుర్కున్న సమస్య రాదని ఆయన అన్నారు.