రాయలసీమలోనే రాజదాని, లేదంటే..: టిజి వెంకటేష్
కర్నూలు/ అనంతపురం: సీమాంధ్ర రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని తాజా మాజీ మంత్రి టిజి వెంకటేష్ డిమాండ్ చేశారు. రాజధానిని తమ ప్రాంతంలో ఏర్పాటు చేయకపోతే ప్రత్యేక రాయలసీమలో తమ బతుకేదో తాము బతుకుతామని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
గతంలో కోల్పోయిన రాజధానిని తిరిగి రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో పోరాటాలు చేస్తామని రాయసీమ పరిరక్షణ సమితి (ఆర్పిఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖ్రెడ్డి హెచ్చరించారు. అనంతపురంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీలతో రాయలసీమకు ఒరిగేదేమీ లేదన్నారు. రాయలసీమలో రాజధాని కోసం ఈ నెల 24,25 తేదీల్లో అన్ని జిల్లాల్లో దీక్షలు చేపడతామని చెప్పారు.
కర్నూలును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా చేయాలని, లేకపోతే సత్యాగ్ర హం చేస్తానని మాజీ మంత్రి మారెప్ప శుక్రవారం హైదరాబాదులోని సచివాలయంలో హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని కర్నూలులో పెడితే సోనియాకు గుడి కడతామని చెప్పారు.
ఇదిలావుంటే, సీమాంధ్రకు తిరుపతిని రాజధానిగా చేయాలని కోరుతూ ఎంపీ చింతామోహన్ శుక్రవారం ప్రధాని మన్మోహన్సింగ్ను కలసి వినతిపత్రం ఇచ్చారు. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలులో రాజధానిని ఏర్పాటు చేశారు.