మనదేశంలో అత్యంత కిక్కిరిసి ఉండే రైల్వేస్టేషన్
ప్రతిరోజు రెండు కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ భారతీయ రైల్వే రికార్డులు సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా 1.10 లక్షల కిలోమీటర్ల రైల్వేలైను ఉంది. ఈరోజుకు దేశంలోని ప్రతిచోటా కొత్త రైల్వేలైను నిర్మాణ పనులు జరుగుతూనే ఉంటాయి. అత్యధిక రద్దీ ఉన్నచోట మూడో మార్గాన్ని కూడా నిర్మిస్తోంది. సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందేభారత్ తోపాటు తొలి బులెట్ రైలును వచ్చే ఏడాది పట్టాలెక్కించబోతోంది. నెట్ వర్క్ పరంగా ప్రపంచంలో నాలుగో స్థానాన్ని దక్కించుకున్న భారతీయ రైల్వేలో దాదాపు ఏడువేల రైల్వేస్టేషన్లు ఉన్నాయి.
ప్రయాణికుల సంఖ్యలో నెంబర్ వన్
ఈ రైల్వేస్టేషన్ల నుంచే అత్యధిక ఆదాయాన్ని రైల్వే ఆర్జిస్తోంది. ఆదాయ పరంగా న్యూఢిల్లీ స్టేషన్ ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే ప్రయాణికుల సంఖ్యపరంగా ముంబయిలోని థానే రైల్వేస్టేషన్ దేశంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ప్రతి సంవత్సరం ఈ స్టేషన్ నుంచి దాదాపు 94 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. ముంబయి పరిధిలోనే ఉన్న కళ్యాణ్ రైల్వేస్టేషన్ దేశంలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. సంవత్సరానికి ఈ రైల్వేస్టేషన్ నుంచి 84 కోట్ల మంది ప్రయాణిస్తుంటారు. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ నుంచి 40 కోట్లమంది ప్రయాణిస్తుంటారు. తక్కువమంది ప్రయాణికులతో మూడోస్థానంలో నిలిచినప్పటికీ న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ ఆదాయం పరంగా ప్రథమస్థానంలో నిలవడం విశేషం.

ఆదాయంలో నెంబర్ వన్
దేశ రాజధాని నగరం కావడంతోపాటు దేశం నలుమూలల నుంచి రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ఇంత ఆదాయం రావడం సాధ్యపడుతోంది. ఢిల్లీ తర్వాత కోల్ కతా, చెన్నై రైల్వేస్టేషన్లు అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ప్రయాణికుల రైళ్లు కాకుండా సరకు రవాణాద్వారానే రైల్వే అధిక ఆదాయం వస్తుంది. వస్తున్న ఆదాయంలో 70 శాతం సరకు రవాణానే అందిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందించేందుకు, సమయపాలన ప్రకారం రైళ్లను నడిపేందుకు రైల్వేబోర్డు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా అనేక మార్పులు చేసుకుంటూ వస్తోంది. ప్రమాదాల నివారణకు కూడా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటోంది. అమృత్ భారత్ పథకం కింద ఎంపిక చేసిన స్టేషన్లను విమానాశ్రయాల తరహాలో తీర్చిదిద్దుతున్నారు.












Click it and Unblock the Notifications