అది ముఖేష్ అంబానీ ఇల్లు, బాబుది కాదు, ఇమేజ్ డ్యామేజ్ చేయాలనే ఇలా: టీడీపీ
పారిశ్రామికవేత్తలైన ముఖేష్ అంబానీ, విజయ్ మాల్యాలకు చెందిన ఇళ్ల ఫోటోలను పట్టుకుని చంద్రబాబు ఇంటి ఫోటోలని ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
హైదరాబాద్: గత రెండు మూడు రోజులుగా అటు మీడియాలోను, ఇటు సోషల్ మీడియాలోను చంద్రబాబు కొత్త ఇల్లు హాట్ టాపిక్గా మారింది. అత్యంత లగ్జరీ సౌకర్యాలతో భారీ వ్యయంతో ఈ ఇంటిని నిర్మించినట్లుగా కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో ఈ ప్రచారం మరింత ఎక్కువైంది.
అయితే టీడీపీ శ్రేణులు మాత్రం ఈ ప్రచారాన్ని తప్పుపడుతున్నాయి. మీడియాలో చంద్రబాబు కొత్త ఇంటిపై తప్పుడు ప్రచారం జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు విజయవాడ కమిషనర్ గౌతమ్ సవాంగ్ కు డీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు వేదవ్యాస్ సహా మరికొందరు నేతలు దీనిపై ఫిర్యాదు చేశారు.
పారిశ్రామికవేత్తలైన ముఖేష్ అంబానీ, విజయ్ మాల్యాలకు చెందిన ఇళ్ల ఫోటోలను పట్టుకుని చంద్రబాబు ఇంటి ఫోటోలని ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు వైసీపీ ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతుందని అన్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని సింగపూర్ కన్నా మిన్నగా తీర్చిదిద్దుతా అని గొప్పలు పోయిన చంద్రబాబు.. రాజధానిని వదిలేసి తన ఇంటిని మాత్రం ఆ స్థాయిలో నిర్మించుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో ఏపీ ప్రజల కోసం ఒక్క పక్కా ఇల్లు కూడా నిర్మించని చంద్రబాబు తన ఇంటిని మాత్రం రహస్యంగా వందల కోట్లతో నిర్మించుకున్నారని భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం నాడు ఆరోపించారు.