తిరుమల శ్రీవారి పాదాల చెంత..!!
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 86,604 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 31,536 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.89 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 14 కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది. కంపార్లమెంట్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారం, మంచినీళ్లు, పాలు పంపిణీ చేశారు. శ్రావణ మాసంలో విశేష పూజలను దృష్టిలో ఉంచుకుని భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద ఈ నెల 16వ తేదీన ఛత్రస్థాపనోత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా టీటీడీ అర్చకులు శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టిస్తారు. పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఏడాదికోసారి ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీనికి పురాణ ప్రాశస్త్యం కూడా ఉంది. తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై శ్రీవేంకటేశ్వరస్వామివారు మొదటగా కాలు మోపినట్టు పురాణాల చెబుతున్నాయి. అందుకే ప్రతి సంవత్సరం శ్రావణ శుద్ధ ద్వాదశినాడు ఛత్రస్థాపనోత్సవాన్ని నిర్వహిస్తుంది టీటీడీ.
ఈ ఉత్సవాల్లో భాగంగా నారాయణగిరిలోని శ్రీవారి పాదాలకు నిర్వహించే తిరుమంజనం కోసం స్వామివారి ప్రధాన ఆలయంలోని బంగారు బావి నుండి తీర్థాన్ని తీసుకుంటారు. రెండవ గంట తరువాత పూజ సామాగ్రి, పుష్పాలు, నైవేద్యానికి ప్రసాదాలు సిద్ధం చేసుకుంటారు. రంగనాయకుల మండపం నుంచి గొడుగులు తీసుకుని, మంగళవాయిద్యాల నడుమ మహాప్రదక్షిణంగా మేదరమిట్ట చేరుకుంటారు.
అక్కడినుంచి అర్చకులు నారాయణగిరి శిఖరం చేరుకుని బంగారుబావి నుండి తెచ్చిన తీర్థంతో శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహిస్తారు. అలంకరిస్తారు. ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యాన్ని సమర్పిస్తారు. అనంతరం వేదపారాయణం చేస్తారు. ప్రబంధ శాత్తుమొరను వినిపిస్తారు. శ్రీవారి పాదాల చెంత గొడుగును ప్రతిష్టించడంతో ఈ ఉత్సవం ముగుస్తుంది.












Click it and Unblock the Notifications